“నగరి’ ఇదేదో మహానగరం కాదు.. పేద్ద పట్టణమూ కాదు.. ఎక్కడో తమిళనాడు బోర్డర్లో ఉన్న చిన్న నియోజకవర్గం. అయినా రాజకీయ పార్టీలన్నీఈ నగరి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇంతకీ ఈ నగరికి అంత క్రేజ్ ఎందుకు?
సాధారణంగా నగరి పేరు చెప్పగానే గుర్తొచ్చేది రోజా. మూడుసార్లు నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన రోజా వరుసగా రెండుసార్లు గెలిచారు. ఇప్పుడు ఏఐసీసీ చైర్మన్ గా ఉన్నారు. అలాంటి నగరిని టార్గెట్ చేస్తూ ఆపరేషన్ నగరికి తెరలేపాయి టీడీపీ, బీజేపీ. నగరిలో పాగా వేయాలంటే సినీ గ్లామర్ తప్పనిసరి అనుకున్న ఇరు పార్టీలు సినీ తారలను పొలిటికల్ స్క్రీన్ మీదకి దించడానికి సిద్ధమయ్యాయి.
నగరి తమిళనాడు బోర్డర్లో ఉండటంతో తమిళ సినిమాల్లో మెరిసిన నటీమణుల ప్రభావం ఉంటుందని భావించిన టీడీపీ వాణీ విశ్వనాథ్ ను బరిలోకి దించాలనుకుంది… కానీ గాలి ముద్దు క్రిష్ణమనాయుడు మరణంతో ఆ సీటు ఆయన కుమారుడికి ఇవ్వాల్సి వచ్చింది. దాంతో వాణీ ఎంట్రీ ఆగిపోయింది.
ఇక ఏపీలో బలపడటమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నగరిపై కన్ను వేసింది. నగరిలో పాగా వేసేందుకు రోజా టార్గెట్ గా బీజేపీ ప్రియారామన్ కు కాషాయ కండువా వేసింది. మరోవైపు రోజా టార్గెట్ గా త్వరలోనే వాణీవిశ్వనాథ్ టీడీపీలో చేరుతున్నారని తెలుగు తమ్ముళ్ల ప్రచారం. మరి రోజాకి చెక్ పెట్టాలనే బీజేపీ, టీడీపీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.