బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ రాయలసీమ మీద పడింది. సీమలో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కొత్త ఎత్తులతో ముందుకు వెళ్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో నైరాశ్యంలో ఉన్న టీడీపీ క్యాడర్కు గాలం వేసి కొంతవరకు సక్సెస్ అయిన బీజేపీ టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కసరత్తు చేస్తోంది.
రాయలసీమ అభివృద్ధి పేరుతో సీమ జిల్లాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న కమలదళం కడప జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తోంది. ఈ పర్యటనలో శనివారం ప్రొద్దుటూరులో పార్టీ అంతర్గత సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రాయలసీమ వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలను ఆహ్వానించారు.
ఈ నెల 15న కడపలో నిర్వహించే సమావేశంలో పార్టీలోకి చేరికలు, కేడర్ కు దిశానిర్దేశం చేయడమే ప్రధాన ఎజెండా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే జిల్లానుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే జయరాములు బీజేపీ తీర్ధం పుచ్చుకోగా.. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఇవాలో రేపో కమలం గూటిలోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ఆది చేరికకు సీఎం రమేశ్ అడ్డు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆది వస్తే తాను బయటకు వెళ్లడం ఖాయమంటూ కండిషన్ పెట్టినట్లు సమాచారం.
అయితే కమలదళం ఎత్తుగడలు టీడీపీలో కలవరం స్రుష్టిస్తున్నాయి. బీజేపీ ఎత్తుగడలను పరిశీలిస్తున్న టీడీపీ నాయకత్వం.. పార్టీని వీడేవారు స్వార్ధపరులని, పార్టీని వీడినంత మాత్రాన టీడీపీని ఎవరూ బలహీన పరచలేరని, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తానికి కమలదళం ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఇప్పట్నుంచే రాజకీయ చదరంగాన్ని మొదలు పెట్టేసింది.