YSRCP: హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయా.? ఇందుకు స్వాతంత్ర్య దినోత్సవమే వేదికగా మారిందా.? అంటే పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీలో వర్గ విభేదాలుకు పంద్రాగస్టు సాక్ష్యంగా నిలిచింది. జాతీయ జెండా ఆవిష్కరణ విషయంలో రెండు వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఇప్పుడు ఈ అంశం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హిందూపురం పక్కనే ఉండే చౌళూరులో రెండు వర్గాలు త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించాయి. అయితే హిందూపురం వైసీపీలోని ఒక వర్గం… ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్తో సంబంధం లేకుండా జాతీయ జెండాను ఎగరేసింది. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ లేకుండా త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడంతో మరో వర్గం అక్కడే జెండా వందనం నిర్వహించింది. అదే స్థానంలో మరో జెండా దిమ్మెను ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు.
అయితే, ఉదయం చేయాల్సిన జెండా ఆవిష్కరణను, మిట్ట మధ్యాహ్నం చేయడంపై విమర్శలు వచ్చారు. ఇదేం విడ్డూరం అంటూ స్థానికులు చర్చించుకున్నారు. ఒక జెండా పక్కనే మరో జెండాను ఆవిష్కరించడంపై రచ్చ మొదలైంది. మొత్తం మీద పంద్రాగస్టు వేదికగా హిందూపురం వైసీపీ వర్గ విభేధాలు తేటతెల్లమయ్యాయి. మరి ఈ వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..