ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరొందిన వారిలో నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకరు. అయితే ఇటీవల ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యాడని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ఊపిరి ఉన్నంత వరకు తాను వైసీపీలోనే కొనసాగుతానని.. జగనన్నతో నే నడుస్తానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు ఓ వర్గం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తనకు, ఎమ్మెల్యే ఆర్థర్కు విబేధాలున్నాయని ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు. తనకు రెండు రాష్ట్రాల్లో గుర్తింపును జగన్ను కల్పించారని, పార్టీ మారాల్సి వస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. కార్యకర్తలకు న్యాయం చేయాలన్న తపన తనదని తెలిపారు. మిడుతూరు మండలానికి హంద్రీ–నీవా నీరు తీసుకురావడం, శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేసేందుకు జీఓ నంబర్ 98 కింద ఉద్యోగాల కల్పన, మున్సిపాలిటీలో పెంచిన పన్ను భారాన్ని తగ్గించడం, నందికొట్కూరు రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు పరిహారం ఇప్పించడం.. తన ముందున్న లక్ష్యాలని.. పార్టీ కోసం సమష్టిగా పని చేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నందికొట్కూరులో వైసీపీ జెండాను ఎగురవేస్తామని స్పష్టం చేశారు.