శాసనమండలిలో కృష్ణా జిల్లా కరకట్ట అక్రమాల తొలగింపుపై వాడీ వేడీగా చర్చ కొనసాగుంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కరకట్ట వెంట ఉన్న 26 కట్టడాలకు నోటీసులిచ్చారని, చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనని, నోటీసులు వచ్చాక తదుపరి చర్యలుంటాయని అన్నారు. గతంలో జరిగిన తప్పును సరిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నీటిపారుదల శాఖ అనుమతి లేకున్నా ప్రజావేదిక నిర్మించారని.. చంద్రబాబు ఇల్లు సహా మిగతా కరకట్ట ఇళ్ళు ఖాళీ చేస్తే ప్రజల్లోకి మంచి సందేశం వెళ్తుందని బొత్స పేర్కొన్నారు.
ఇందుకు సమాధానంగా టీడీపీ నేతలు బొత్సకు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ హయాంలోనే కరకట్ట కట్టడాలకు అనుమతులు వచ్చాయని.. అప్పుడేం చేశారని.. ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చివేత కక్ష్యపూరిత చర్యే అని అన్నారు. చంద్రబాబు ఉండే నివాసానికి కోర్టు అనుమతులు ఉన్నాయని టీడీపీ నేతలు పేర్కొన్నారు.