సినీ నటుడు, మాజీ టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ భవన్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసిన ఆయన ఈ స్పందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. హరికృష్ణ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు హరికృష్ణ చైతన్య రథానికి సారధిగా ఉన్నారని.. పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించారని అన్నారు. తెలుగు భాషను హరికృష్ణ ఎంతో అభిమానించేవారని.. తెలుగు భాషా దినోత్సవం రోజే ఆయన మృతి చెందడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. హరికృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమని చంద్రబాబు తెలిపారు.
మరోవైపు ట్విట్టర్లో చంద్రబాబు హరికృష్ణను స్మరించుకున్నారు. ‘‘ఎన్టీఆర్ ఆదర్శాల బాటలో నడిచి ప్రజాబంధువుగా, సౌమ్యుడిగా ప్రజల హృదయాలలో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్న కీర్తిశేషులు హరికృష్ణగారు. ఆ మంచిమనిషి మనకు దూరమై ఏడాది గడిచినా మన మధ్యలోనే ఉన్నారనిపిస్తోంది. ఈరోజు హరికృష్ణగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మీయ స్మృతులను స్మరించుకుందాం’’ అని బాబు ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ ఆదర్శాల బాటలో నడిచి ప్రజాబంధువుగా, సౌమ్యుడిగా ప్రజల హృదయాలలో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్న కీర్తిశేషులు హరికృష్ణగారు. ఆ మంచిమనిషి మనకు దూరమై ఏడాది గడిచినా మన మధ్యలోనే ఉన్నారనిపిస్తోంది. ఈరోజు హరికృష్ణగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మీయ స్మృతులను స్మరించుకుందాం. pic.twitter.com/BJ5lZQzZZ9
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 29, 2019
కాగా గతేడాది ఇదే రోజున హైదరాబాద్ నుంచి నెల్లూరులోని ఓ వేడుకకు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ హరికృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే.