కర్నాటక నెక్ట్స్ సీఎం ఎవరు ? యడ్యూరప్ప వారసుడిగా ఎవరు వస్తారు ? BJP అధిష్టానం ఎవరిని నిలబెడుతుందన్న దానిపై కర్నాటక రాజకీయాల్లో ఉత్కంఠ సాగుతోంది. 75 ఏళ్లు దాటిన వారు కీలక పదవుల్లో ఉండరాదన్న అధిష్టానం నిర్ణయంతో.. ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్ప వైదొలిగారు. ఈ నేపథ్యంలో నాయకత్వ మార్పు ఆసక్తి రేపుతోంది. కర్నాటక CM బరిలో మొత్తం 10 మంది వరకున్నారు. అందులో ఎవరిని ఈ పదవి వరిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.
CM బరిలో ఉన్న వారిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు కర్నాటకకు చెందిన సీనియర్ నేతలు B.L సంతోష్, C.T రవి, మాజీ మంత్రి సదానంద గౌడ, CN అశ్వనాథ్నారాయణ్, లక్ష్మణ్ సవడి, బసన్నగౌడ పాటిల్ యత్నల్, మురుగేశ్ నిరానీ, బసవరాజు బొమ్మాయ్, గోవింద్ కర్జోల్, విశ్వేశ్వర హెగ్డే కగేరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
వీరిలో ఎవరిని నియమిస్తుందన్నదే ఇప్పుడు అసలైన టాస్క్. 2023లో జరిగే ఎన్నికల్లో మళ్లీ బీజేపీని గెలుపుపథంలో నడిపించాలంటే.. ఆ దిశగా నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకుపోయే నేత అయితేనే బెటర్ అన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త CM ఎంపిక బాధ్యతను పార్టీ పార్లమెంటరీ బోర్డుతో పాటు పార్టీ శాసనసభా పక్షానికి కట్టబెట్టింది.
మంగళవారం రోజు ఢిల్లీలో జరిగే పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో ఏమైనా కొత్త CM అభ్యర్ధిని ప్రకటిస్తారా అన్న ప్రచారమూ ఉంది. కొత్త CM ఎంపిక కోసం నిర్వహించే BJP శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పరిశీలకుడిగా వ్యవహరించనున్నట్లు BJP వర్గాలు తెలిపాయి.