ఎన్నికల సమయంలో అధిష్టానం తమకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు దిగమింగడం పార్టీ నాయకులకు చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది భవిష్యత్ హామీల నేపథ్యంలో అలకపాన్పు వదిలినా..కొందరు తిరుగుబాటు బావుటా ఎగరవేసి రెబల్స్గా బరిలోకి దిగుతారు. అయితే ముందు నుంచి క్రమశిక్షణ గల పార్టీగా పేరున్న టీడీపీ..అధిష్టానం నిర్ణయాన్ని కాదని ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన 9మంది రెబల్ అభ్యర్థులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వేటు వేశారు. రంపచోడవరం- ఫణీశ్వరి, గజపతిగనగరం- కె.శ్రీనివాసరావు, అవనిగడ్డ- కంఠమనేని రవిశంకర్, తంబాళ్లపల్లి- ఎం.మాధవరెడ్డి, ఎన్.విశ్వనాథరెడ్డి, మదనపల్లి- బొమ్మనచెరువు శ్రీరాములు, బద్వేల్- ఎన్.విజయజ్యోతి, కడప- ఎ.రాజగోపాల్, తాడికొండ- సర్వా శ్రీనివాసరావులను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీ అధిష్టానం ప్రకటించింది.