వేసవిలో జీలకర్ర, కొత్తిమీర, పుదీనా ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఉండవు. అలాగే రోజూ నీళ్లు ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు.
జీలకర్ర నుంచి నల్ల మిరియాలు వరకు - వంటలో రుచిని పెంచడానికి అనేక మసాలా దినుసులను ఉపయోగిస్తారు. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వేసవిలో మాత్రం కొన్ని మసాలా దినుసులను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
వెల్లుల్లి బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాదు వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తుంది. అయితే వేసవిలో వెల్లుల్లిని ఎక్కువగా తినకపోవడమే మంచిది. వెల్లుల్లిని ఎక్కువగా తింటే కడుపులో మంట పుడుతుంది. దీంతో పాటు యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వేసవిలో వెల్లుల్లిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
అల్లం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఎన్నో గుణాలు అల్లంలో ఉన్నాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జలుబును దూరం చేస్తుంది. అయితే సమ్మర్లో అల్లం ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
వేసవిలోనే కాదు ఏ సీజన్లో నైనా కారం ఎక్కువగా తీసుకోకూడదు. మోతాదుకు మించి కారం తీసుకుంటే కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వంటల్లో ఈ మసాలా దినుసులను తక్కువగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే కడుపులో మంట, ఉబ్బరం సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
మిరియాలలో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాదు ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడుతాయి. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. మోతాదుకు మించి తీసుకుంటే శరీరంలో వివిధ రకాల అలర్జీ సమస్యలు కలుగుతాయి.
వేసవిలో కొన్ని మసాలా దినుసులను దూరం పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.