Water Taxi Services: వాణిజ్య రాజధాని ముంబయిలో త్వరలోనే సరికొత్త రవాణా విధానం అందుబాటులోకి రానుంది. 2022 జనవరి నుంచి నగరంలో వాటర్ టాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ ముంబయి తీరం నుంచి నుంచి నవీ ముంబయి మధ్య ఈ వాటర్ టాక్సీలు తిరగనున్నాయి. ఇప్పటికే మూడు సంస్థలు వాటర్ టాక్సీ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తుందని సమాచారం.. కాగా త్వరలోనే మరో సంస్థ కూడా ఈ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి నవీ ముంబయి వరకు ఒక ప్రయాణికుడి నుంచి 1200 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు వసూలు చేయనున్నట్లు సమాచారం. జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ వరకు 750 రూపాయలు చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి ఎలిఫెంటా వరకు, డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి రేవాస్, ధరంతర్, కరంజాదే వరకు… డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి బేలాపూర్, నేరుల్, అయిరోలి, వాషి, ఖందేరీ ఐలాండ్స్, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ మార్గాల్లోనూ వాటర్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో రూట్లో గరిష్ట ప్రయాణ సమయం 30 నిమిషాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.