దేశ వ్యతిరేక పోస్టులు పెడితే.. ఇకపై జీవితఖైదే.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం!

|

Aug 28, 2024 | 8:32 PM

దేశ వ్యతిరేక పోస్టులు పెడితే.. ఇకపై అంతే సంగతలు..! ఏకంగా పడే శిక్ష జీవిత ఖైదే.. అంటోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అటు.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ రెండింటికి సంబంధించి సరికొత్త సోషల్‌ మీడియా పాలసీ తీసుకొచ్చింది యోగీ సర్కార్.

దేశ వ్యతిరేక పోస్టులు పెడితే.. ఇకపై జీవితఖైదే.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం!
Yogi Adityanath Cabinet
Follow us on

దేశ వ్యతిరేక పోస్టులు పెడితే.. ఇకపై అంతే సంగతలు..! ఏకంగా పడే శిక్ష జీవిత ఖైదే.. అంటోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అటు.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ రెండింటికి సంబంధించి సరికొత్త సోషల్‌ మీడియా పాలసీ తీసుకొచ్చింది యోగీ సర్కార్.

ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ అవుతోంది. అయితే.. కొన్ని సందర్భాల్లో మంచి జరుగుతున్నా.. కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ కేసులతో జైళ్ల పాలవుతున్న పరిస్థితులు దర్శనిమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తప్పుడు సమాచారానికి.. ఇష్టరీతి పోస్టులకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం.

సోషల్‌ మీడియాలో తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేసేవారి ఆట కట్టించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్. యూపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ సరికొత్త సోషల్‌ మీడియా పాలసీకి యోగీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ద్వారా సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టేవారిపై కొరడా ఝుళిపించబోతోంది. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారికి కఠిన శిక్షలు విధించేందుకు రెడీ అవుతోంది. ప్రధానంగా.. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగం వల్ల జరిగిన నష్టాలను చట్టపరంగా పరిష్కరించేందుకు కూడా ఈ కొత్త పాలసీ ఉపయోగపడుతుందని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా.. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై తీవ్రతను బట్టి కనీసం మూడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది.

ఇక, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న స్కీమ్స్‌పైనా ప్రజలకు అవగాహన కల్పించబోతోంది. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేవారికి డబ్బులు చెల్లించబోతోంది. ఈ మేరకు.. వీ-ఫారమ్‌ అనే డిజిటల్‌ ఏజెన్సీని రూపొందించింది. దీని ద్వారా ప్రసారమయ్యే పోస్టులు, వీడియోలు, రీల్స్‌కు బాధ్యత వహించనుంది. అందుకు అనుగుణంగానే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, అకౌంట్లకు కొన్ని నియమాలను నిర్దేశించింది. మొత్తంగా.. సోషల్‌ మీడియాలో తప్పుడు కంటెంట్‌కు చెక్‌ పెట్టి.. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమే లక్ష్యంగా కొత్త పాలసీని తీసుకొస్తోంది యోగీ సర్కార్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..