కన్హయ్య కుమార్పై గతంలో నమోదైన దేశద్రోహం కేసుపై విచారణ జరిపేందుకు కేజ్రీవాల్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేజ్రీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై కన్హయ్య కుమార్ స్పందించారు. త్వరలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఉద్దేశ పూర్వకంగా తనపై ఉన్న పెండింగ్ కేసులను తిరగతోడుతున్నారని ఆరోపించారు.
గతంలో తాను ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైన తరుణంలో ఛార్జ్షీట్ దాఖలు చేశారని.. ఇప్పుడు బీహార్ ఎన్నికల సందర్భంగా తనపై విచారణకు ఆదేశించారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉందని.. రాజకీయ లబ్ధి కోసమే ఇన్నాళ్లు కేసును తొక్కిపట్టి ఉంచారని ఆరోపించారు. అయితే తనపై ఉన్న కేసుల విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలో దేశద్రోహం కేసులు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో దేశ ప్రజలకు చెబుతానని కన్హయ్య పేర్కొన్నారు.
కాగా.. ఢిల్లీలోని జేఎన్యూలో విద్యార్ధి నేతగా ఉన్న కన్హయ్య కుమార్ టీం.. అప్పట్లో పార్లమెంట్పై దాడి కేసు సూత్రధారి ఉగ్రవాది అఫ్జల్ గురుకి వర్ధంతి కార్యక్రమం చేపట్టారు. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో మన దేశానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. పాకిస్థాన్కు మద్ధతుగా నినాదాలు చేస్తూ.. అఫ్జల్ గురును అమరుడిగా కీర్తించారు. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది. కన్హయ్య కుమార్పై దేశ ద్రోహం కేసు నమోదు చేసింది. కన్హయ్యతో పాటుగా మరో 16మందిపై కూడా ఆరోపణలు వచ్చినా.. సరైనసాక్ష్యాధారాలు లభించకపోవడంతో కొందర్ని వదిలిపెట్టారు.