అయోధ్యలో నిర్మించబోయే భవ్య రామ మందిర నిర్మాణం నమూనాపై ఓ క్లారీటీ వచ్చింది. ఇప్పటి వరకు రామ మందిర నిర్మాణంలో గతంలో అనుకున్న నమూనా కాకుండా.. కొన్ని మార్పులు ఉంటాయన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందించారు. ముప్పై ఏళ్ల కిందటే.. రామ మందిర నిర్మాణం కోసం.. ఓ మోడల్ను విశ్వ హిందూ పరిషత్ రూపకల్పన చేసిందన్నారు. ఆ నమూనా ప్రకారమే రామ మందిర నిర్మాణం జరుగుతుందని చంపత్ రామ్ స్పష్టం చేశారు.
వీహెచ్పీ ప్రతిపాదించిన రామమందిర నిర్మాణ మోడల్లో ఎలాంటి మార్పులూ చేపట్టడం లేదన్నారు. కోల్కతాలో ప్రస్తుతం ఐదు అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు కలిగిన ఫైబర్ టెంపుల్ కోల్కతాలో నిర్మాణ దశలో ఉందని అయోధ్యలోని కరసేవక్పురంలో స్పష్టం చేశారు.
కాగా.. మందిర నిర్మాణ నమూనాలో మార్పులు కోరుకునేవారు రామ మందిర నిర్మాణాన్ని కోరుకునేవారు కాదన్నారు. అంతేకాదు మోడల్లో మార్పులు చేస్తే మందిర నిర్మాణంలో ఆలస్యం అవుతుందన్నారు. ఇదిలావుంటే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా త్వరలో అయోధ్యను సందర్శించి మందిర నిర్మాణంపై సంప్రదింపులు జరపనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్తో సీఎం యోగి సమావేశమవుతారు.