తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చలి శశికళ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైంది. తమిళనాట చిన్నమ్మగా ప్రసిద్ది చెందిన శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవించింది. అయితే ఇటీవల కరోనాకు గురికావడంతో విక్టోరియా హాస్పిటల్లో చికిత్స తీసుకుంది. అనంతరం అధికారులు హాస్పిటల్లోనే విడుదల ప్రక్రియను పూర్తి చేశారు. భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు శశికళ మేనల్లుడు దినకరన్ అన్ని ఏర్పాట్లు చేశాడు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో శశికళ కోసం భవనం కూడా నిర్మించాడు. అయితే శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునేది లేదని సీఎం పళనిస్వామి అంటున్నారు. శశికళ వెంట పార్టీ నేతలు కూడా ఎవరూ వెళ్లే అవకాశం లేదని మంత్రి జయకుమార్ చెబుతున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ చిన్నమ్మ ఏం నిర్ణయం తీసుకుంటుందోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్నమ్మ గత చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే..
2016 మేలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసింది. అనంతరం 2016, సెప్టెంబరు 23 అనారోగ్యంతో చెన్నై అపోలో అసుపత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5న మృతిచెందింది. తర్వాత సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేయగా.. ఏఐఏడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళ నియామకమయ్యారు. అనంతరం 2017, ఫిబ్రవరి 5న ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 6 సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఫిబ్రవరి 9న ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలంటూ శశికళ గవర్నర్ను కోరింది. ఇదిలా ఉంటే 2017, ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఫిబ్రవరి 15న తన విధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.
ఆ తర్వాత కొన్ని రోజులకు ఏఐఏడీఎంకే పార్టీలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపుల మధ్య విభేదాలు రావడంతో పన్నీర్ సెల్వంను డిప్యూటీ సీఎంగా నియమించారు. అనంతరం 2017, అగస్టు 21న ఏఐఏడీఎంకే పార్టీ నుంచీ శశికళ, దినకరన్లను బహిష్కరించారు. ఆర్కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా దినకరన్ విజయం సాధించారు. 2018, మార్చి 15న ఎమ్మెల్యే దినకరన్ ఆధ్వర్యంలో అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎమ్ఎమ్కె) పార్టీ ఆవిర్భావం చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా శశికళ ఎంపికైంది. 2019 లోక్సభ ఎన్నికలలో ఏఎమ్ఎమ్కె పార్టీ 6 శాతం ఓట్లు సాధించింది. అయితే నాలుగేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయిన శశికళ ఇప్పుడు ఏం చేస్తుందనేదే ఆసక్తిగా మారింది. ఏఐఏడీఎంకే పార్టీలో చీలిక వస్తుందా చిన్నమ్మ వెంట ఎంతమంది వెళతారు అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఏం చేస్తారు.. బీజేపీ వ్యూహం ఏవిధంగా ఉండబోతోంది? ఇలాంటి ప్రశ్నలు అందరి మెదళ్లలో తలెత్తుతున్నాయి. 4 దశాబ్దాల తరువాత జయలలిత, కరుణానిధి లేకుండా తమిళనాట ఎన్నికలు జరుగుతుండటం విశేషం. దీంతో తమిళ రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.