రాహుల్గాంధీని ఉద్దేశించి లోక్సభలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై రగడ జరిగింది. తన కులం ఏదో తెలియని వ్యక్తి కులగణన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు అనురాగ్ ఠాకూర్. తనను సభలో ఎన్నిసార్లు అవమానించినా భాధపడనని , తప్పకుండా కులగణన అమలు చేసి చూపిస్తామన్నారు రాహుల్గాంధీ.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. లోక్సభలో వివక్ష నేత రాహుల్గాంధీ , కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దళితులు , ఓబీసీలపై కాంగ్రెస్ నేతలు కపటప్రేమ చూపిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. కులగణన పేరుతో రాహుల్గాంధీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
రాహుల్గాంధీపై అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. తన కులం గురించి తెలియని వ్యక్తి కులగణన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో రాజీవ్గాంధీ పార్లమెంట్ లోనే ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని అన్నారు అనురాగ్ ఠాకూర్.
అనురాగ్ఠాకూర్ వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. విపక్ష సభ్యులు కేంద్రమంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా తనను కేంద్రమంత్రి అవమానించారని రాహుల్గాంధీ మండిపడ్డారు. అయినప్పటికి తనకు అనురాగ్ఠాకూర్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
అయితే తాను రాహుల్గాంధీ పేరును సభలో ప్రస్తావించలేదన్నారు అనురాగ్ఠాకూర్. తన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. మరోవైపు అగ్నిపథ్ పథకంపై కూడా సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్యాదవ్తో కూడా అనురాగ్ఠాకూర్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..