హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించేంతవరకు తాము ధర్నా చేస్తామన్నారు. ఈ అన్నదాతలపై తాను కేసును ఉపసంహరించుకుంటానని జననాయక్ జనతా పార్టీ నేత దేవేందర్ సింగ్ బబ్లీ హామీ ఇచ్చిన తరువాత కూడా ఖాకీలు వారిని విడుదల చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఆయన అపాలజీ కూడా చెప్పారని, అయినా తమవారిని రిలీజ్ చేయకపోతే తమను కూడా అరెస్టు చేయాలని తికాయత్ కోరారు. నిజానికి రైతులను దుర్భాషలాడిన బబ్లీ మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలనీ ఆయన అన్నారు. కేంద్రం వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయని పక్షంలో తమ ఆందోళన 2024 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆ ఏడాది కేంద్రం తప్పకుండా వీటిని రద్దు చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఇలా ఉండగా రైతులకు, జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ మధ్య రేగిన రగడ హర్యానాలో దుమారం రేపింది. ఈ నెల 1 న కొంతమంది రైతులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని, వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేయడం, రైతు సంఘాలు ఇందుకు నిరసన తెలపడంతో ఫతేహాబాద్ జిల్లా దాదాపు అట్టుడికింది. నిరసన చేస్తున్న రైతులు పలువురిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకుపోయారు.
అయితే జననాయక్ జనతా పార్టీ నేత ఆ తరువాత తన వైఖరి పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తనపట్ల అనుచితంగా ప్రవర్తించినవారిని తాను క్షమిస్తున్నానంటూ నిన్న వీడియో విడుదల చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏనుగు వింత చేష్టలు..నీరు త్రాగేందుకు కూడా సోమరితనాన్ని ప్రదర్శిస్తున్న గజరాజు..:Elephant Viral Video