తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ నిర్భయ దోషి ముకేశ్ చేసిన అభ్యర్థన రాష్ట్రపతి భవన్కు చేరింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ పిటిషన్ను పంపగా.. క్షమాభిక్ష ప్రసాదించవద్దు అని ఆ శాఖ డిమాండ్ చేసింది. దీనిపై రాష్ట్రపతి తొందరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించకపోయినా.. పిటిషన్ రద్దు తర్వాత దోషులకు 14 రోజలు పాటు ఉరిశిక్ష విధించడం కుదరదు. ఎందుకంటే.. జైలు నిబంధనల ప్రకారం ఒక కేసులో ఒకరి కంటే ఎక్కువమందికి మరణశిక్ష విధించినప్పుడు.. ఆ దోషుల్లో ఒకరు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటే.. మిగిలిన దోషులందరికీ శిక్ష అమలును నిలిపివేయాలి. క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించాక 14 రోజుల గుడువతో దోషులను ఉరితీయాల్సి ఉంటుంది.
నిర్భయ కేసులో నలుగురు దోషులైన అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, ముకేశ్ కుమార్, పవన్ గుప్తాకు జనవరి 22వ తేదీన ఉరిశిక్ష అమలు చేసేందుకు నిర్ణయించారు. అయితే ముకేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉన్నందున ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.