కరోనా మహమ్మారి చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. కరోనా వచ్చినప్పటి నుంచి పేస్ మాస్కులు తప్పని సరైంది. మొదట్లో మాస్కులు పెద్దగా ధరించకపోగా, అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ఆంక్షలు విధించారు. కొందరు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం చేసిన వారిపై కొరఢా ఝులిపించారు పోలీసులు. ఇక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై భారీగా జరిమానాలు విధించారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో వాహనాల దారులు ఫేస్ మాస్కులు ధరించని వారిపై భారీ ఎత్తున జరిమానాలు వసూలు చేశారు.
మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం చేసిన 3 లక్షల 41 వేల మంది నుంచి రూ. 18.41 కోట్ల జరిమానాను వసూలు చేశామని అహ్మదాబాద్ ట్రాఫిక్ డిప్యూటీ పోలీసు కమిషనర్ హర్షద్ పటేల్ తెలిపారు. అహ్మదాబాద్ పోలీసు శాఖలో 1400 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, వారిలో 13 మంది మరణించారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం 13,298 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఇక గుజరాత్ రాష్ట్రంలో 2.10 లక్షల మందికి కరోనా సోకగా, 4,171 మంది మరణించారు.
కాగా, దేశంలో కరోనా మహమ్మారి గతంలో తీవ్ర స్థాయిలో ఉండగా, ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. కరోనా కట్టడికి దేశంలో ఎన్నో చర్యలు చేపట్టారు. వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేనందున ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. వ్యాక్సిన్ తయారీలో భారత్తో పాటు పలు దేశాలు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు ట్రయల్ రన్లో ఉండగా, మరికొన్ని వ్యాక్సిన్లు తుది దశలో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.