Odisha: నిజంగా కొన్ని ఘటనల గురించి వింటుంటే ఇది నిజమా అనిపిస్తుంది. అసలు ఇలాంటివి జరుగుతాయా అని ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా కటక్ జిల్లా(Cuttack District)లోని గతిరౌట్ పాట్నా గ్రామపంచాయతీ పరిధిలోని నహభంగా గ్రామంలోని దినబంధు బెహరా అనే వ్యక్తి ఇంట్లో శనివారం రోజు తవ్వకాలు జరపగా 14 పురాతన ఇత్తడి విగ్రహాలు(brass idols) లభ్యమయ్యాయి. అయితే ఇంట్లో తవ్వకాలు జరపడం వెనుక పెద్ద కథే ఉంది. దినబంధు చెబుతున్న వివరాలు ప్రకారం.. ఇంట్లోని ఓ ప్రాంతంలో తవ్వకాలు జరపమని దేవుడు కలలో కనిపించి చెప్పాడట. ఆ కల ప్రకారం రోజూ తాను పడుకునే మంచం కింద స్థలంలో తొలుత పూజలు చేసిన అనంతరం.. సుమారు 15 అడుగులు మేర తవ్వించగా.. వివిధ దేవుళ్లకు సంబంధించిన 14 ఇత్తడి విగ్రహాలు లభించాయి. ఈ వింత ఘటన గురించి తెలిసిన వెంటనే.. ఆ విగ్రహాలను దర్శించుకునేందుకు వందలాది మంది స్థానికులు అక్కడికి తరలివస్తున్నారు. బెహరాతో పాటు అతని కుటుంబ సభ్యులు ఇంట్లో విగ్రహాలకు పూజలు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని కటక్ సదర్ పోలీసులు సందర్శించి ఘటనపై విచారణ చేపట్టారు.
రికవరీ చేసిన విగ్రహాలను జిల్లా యంత్రాంగానికి అప్పగించడం తనకు ఇష్టం లేదని బెహరా చెబుతున్నాడు. తన కలలో దేవుడు చెప్పిన విధంగా దేవాలయం ఏర్పాటు చేసి విగ్రహాలను ప్రతిష్టిస్తానని వెల్లడించాడు. బెహరా చెప్పిన విధంగానే గ్రామంలో గుడి కట్టి విగ్రహాలకు పూజలు చేయాలనుకుంటున్నట్లు ఆ గ్రామస్థులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి