డాక్టర్ రేప్ మర్డర్తో అట్టుడుకుతున్న కోల్కతా RG ఖర్ మెడికల్ కాలేజీలో పరిస్థితి దారుణంగా తయారైంది. గుర్తు తెలియని వ్యక్తులు నిన్న ఆస్పత్రి ప్రాంగణంలో చొరబడి దాడులు చేయడంతో అక్కడ పరిస్థితి భయానకంగా తయారైంది. అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు మెడికల్ కాలేజీపై దాడికి తెగబడ్డారు. వందల సంఖ్యలో చొచ్చుకురావడంతో వారిని అక్కడున్న సిబ్బంది నియంత్రించలేకపోయారు. ఎమర్జెన్సీ వార్డంతా బీభత్సంగా మారిపోయింది.
కోల్కతా మెడికల్ కాలేజీలో జరిగిన విధ్వంసానికి బెంగాల్ ప్రభుత్వానిదే బాధ్యత అని బెంగాల్ గవర్నర్ CV ఆనందబోస్ ఆరోపించారు. RG ఖర్ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడి జరిగిన విధ్వంసాన్ని ఆయన పరిశీలించారు. ఆందోళన చేస్తున్న డాక్టర్లతో మాట్లాడారు. డాక్టర్లకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. చట్టాన్ని రక్షించాల్సిన వాళ్లే కుట్రదారులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులలో ఒక వర్గం వ్యవహారాన్ని రాజకీయం చేస్తోందని గవర్నర్ మండిపడ్డారు.
అటు డాక్టర్లు, నర్సుల నిరనసలు ఆస్పత్రిలో కొనసాగుతునే ఉన్నాయి. తమ ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని ఆరోపిస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్ను ఘెరావ్ చేశారు. రోగులకు తాము చికిత్స అందిస్తామని ఈ విషయంలో రాజీపడమని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో నిన్న రాత్రి జరిగిన సంఘటనలతో తాము చాలా ఆందోళనకు గురయ్యాయమని నర్సులు తెలిపారు. మరోవైపు నిన్న అర్థరాత్రి తర్వాత జరిగిన దాడిలో క్రైమ్ సీన్కు ఏమి కాలేదని కోల్కతా పోలీసులు స్పష్టం చేశారు. క్రైమ్ జరిగింది సెమినార్ హాల్లో అని తెలిపారు. అక్కడికి ఎవరూ రాలేదని అన్నారు. దీనిపై దుష్ప్రచారం జరుగుతోందని కోల్కతా పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి