Governor vs Chief Minister: గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. ఈ కాంట్రవర్సీ ఇప్పుడు తెలంగాణలోనే కాదు. తమిళనాడులోనూ కాకరేపుతోంది. తమిళనాడులో ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఫైట్ పీక్స్కు చేరింది. నీట్ బిల్లును వెనక్కి పంపడంతో గవర్నర్ తీరుపై గుర్రుగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తాజాగా మరో కీలక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. యూనివర్సిటీల్లో ఉప సంచాలకుల నియామకం ప్రభుత్వమే చేపట్టేలా తీర్మానం చేశారు. ఇదే విషయంలో గవర్నర్తో ఢీ అంటే ఢీ అంటున్నారు.
స్టాలిన్ ప్రభుత్వానికి, గవర్నర్ రవికి మధ్య రచ్చ మరింత పెరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్కు ఉన్న అధికారాలను తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. యూనివర్శిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి సోమవారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు ఈ అధికారం ఎందుకుండదని ప్రశ్నిస్తోంది డీఎంకే. కేంద్రం పరిధిలో ఉన్న గవర్నర్లు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని..ఇకపై రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా యూనివర్సిటీల్లో గవర్నర్ నియామకాలు చెల్లవంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పాలనపై గవర్నర్ ఆధిపత్యాన్ని ఒప్పుకునేది లేదంటున్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే పోరాటం చేస్తామంటున్నారు.
అయితే, సంప్రదాయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్ వర్శిటీల వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా గవర్నర్లు దాన్ని తమ ప్రత్యేక హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సీఎం స్టాలిన్ అంటున్నారు. ఇది ప్రభుత్వాన్ని అగౌరవపర్చడమే గాక, ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం. అంతేగాక, వైస్ ఛాన్సలర్ల నియామకం విషయంలో ప్రభుత్వానికి అధికారం లేకపోవడం ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశ్వవిద్యాలయ పాలనావ్యవహారాల్లోనూ గందరగోళం సృష్టిస్తోందని చెప్పుకొచ్చారు.
2010లో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ మోహన్ పూంఛీ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం స్టాలిన్ ప్రస్తావించారు. యూనివర్శిటీల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ను తొలగించాలని ఆ కమిటీ సిఫార్సు చేసినట్లు గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ వీసీలను గవర్నర్ నేరుగా నియమించరు. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిని వీసీగా ఎంచుకుంటారని స్టాలిన్ గుర్తు చేశారు.
కాగా.. తమిళనాడులోని రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రారంభించారు. ఇదే సమయంలో స్టాలిన్ ప్రభుత్వం గవర్నర్ అధికారాల్లో కోత విధించేలా బిల్లు తీసుకురావడం గమనార్హం. అయితే, ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, అన్నాడీఎంకే వ్యతిరేకించగా.. పీఎంకే పార్టీ సమర్థించింది.
ఇటు తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై మధ్య గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య సంబంధాలు కట్ అయిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అవమానిస్తున్నారంటూ గవర్నర్ తమిళిసై బహిరంగంగానే వెల్లగక్కారు. గవర్నర్ ప్రొటోకాల్ రగడ ముదిరి పాకాన పడి ఢిల్లీ చేరింది. గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చేయిదాటి పోతున్నట్లు హస్తినకు రిపోర్ట్ చేశారన్నది సమాచారం.
ఇక, రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరుస ఆత్మహత్యలపై గవర్నర్ నివేదిక కోరడం సంచలనంగా మారింది. ఖమ్మం సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణాలేంటి? రామాయంపేట తల్లి, కొడుకుల సూసైడ్కు దారితీసిన పరిస్థితులేంటి? భువనగిరి పరువు హత్యలో అసలేం జరిగింది? నల్గొండ గ్యాంగ్ రేప్ ఘటన వెలుగుచూడని కోణాలేంటి? ఇలా వరుస ఘటనలపై రిపోర్ట్ అడిగారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో మెడికల్ సీట్ల దందాపై గవర్నర్ సీరియస్ అయ్యారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని కాళోజి యూనివర్సిటీ వీసీని ఆదేశించారు. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగడంపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా స్వయంగా డాక్టర్నే అని గుర్తుచేశారు. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీనిపై గవర్నర్ తమిళిసై రిపోర్ట్ అడిగారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
అయితే, దేశంలో ప్రభుత్వాలు వర్సెస్ గవర్నర్గా కాంట్రవర్సీ కొనసాగుతన్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ సంచలన కామెంట్స్ చేశారు. గవర్నర్ పదవులు అనవసరమైనవని అభిప్రాయపడ్డారు. తమిళనాట ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభలో రూపొందించిన ముసాయిదా బిల్లులపై గవర్నర్ 3 నెలలు గడిచినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో దేశం లో గవర్నర్లు అవసరమా? ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదా? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్లు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, తాము అనుకున్నట్టుగానే ఫాసిస్ట్ ధోరణులతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు జస్టిస్ చంద్రు. న్యాయశాస్త్రం చదివే విద్యార్థులు, అధ్యాపకులు కోర్టు తీర్పులను విమర్శించాలన్నారు. అపుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని జస్టిస్ చంద్రూ పేర్కొన్నారు.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
ఈ స్థితిలో గవర్నర్ పదవి ఎలా వచ్చిందని, ఆ పదవి ఎందుకు వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. గవర్నర్ పదవి అనేది స్వతంత్ర భారతదేశంలో ఏర్పడిన పదవి కాదు. ఇది బ్రిటీష్ పాలనలో ఉన్న పోస్ట్. భారతదేశంలో బ్రిటీష్ పాలనలో ‘వైశ్రయ్’ పదవి ప్రధాన పదవి. గవర్నర్ పదవి అనేది సంస్థానాలలో కార్యనిర్వాహక అధిపతి. బ్రిటిష్ వారు తమ దేశంలో అనుసరించిన చట్టానికి అనుగుణంగానే భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగంలోని 152 నుండి 162 వరకు ఉన్న అధికరణలు గవర్నర్కు సంబంధించిన విషయాలను మాత్రమే సూచిస్తాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి గవర్నర్ అవసరం.
ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గవర్నర్
అదేవిధంగా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 154 ప్రకారం, అన్ని కార్యనిర్వాహక అధికారం గవర్నర్పై ఉంటుంది. గవర్నర్ నేరుగా లేదా పరోక్షంగా అధికారుల ద్వారా పరిపాలనా విధులను నిర్వహించవచ్చు. అదేవిధంగా సెక్షన్ 159 ప్రకారం గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి అయినప్పటికీ, నిజమైన అధికారం రాష్ట్ర మంత్రివర్గంపై ఉంటుంది. మంత్రివర్గానికి నాయకత్వం వహించే మొదటి వ్యక్తిని రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ మంత్రిత్వ శాఖలు, శాఖలను కేటాయిస్తారు. రాష్ట్ర పరిపాలనలో రాజ్యాంగాన్ని పరిరక్షించడం గవర్నర్ విధి.
గవర్నర్ పదవి అనేది రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన పదవి. అందువల్ల గవర్నర్ పదవి చాలా ముఖ్యమైన పదవి. ఈ పదవి అవసరమా అని కొన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయిస్తుంది. కాబట్టి, గవర్నర్ కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రతినిధి. గవర్నర్ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, కేంద్ర ప్రభుత్వం తరఫున రాపై ఐ.పి. అటువంటి గూఢచారి వ్యవస్థల ద్వారా గుర్తించవచ్చని కొన్ని పార్టీ నేతలు వాదిస్తున్నారు. కానీ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పర్యవేక్షించడమే కాకుండా, బిల్లులను కూడా ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును ఆమోదించినప్పుడు, బిల్లు అవసరమా కాదా అనే దానిపై స్పష్టత కోరుతుంది. అంతేకాదు సందేహం ఉంటే, దానిని మరోసారి చర్చకు తిరిగి పంపడం జరుగుతుంది. గవర్నర్ లేకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చట్టాలు చేస్తుంది. అక్కడ గవర్నర్ అవసరం. రాష్ట్ర మంత్రివర్గం రద్దు చేయబడిన పరిస్థితిలో, గవర్నర్ రాష్ట్ర పరిపాలనను నిర్వహిస్తారు. కాబట్టి, గవర్నర్ అవసరమా? అనవసరమా అన్నదానిపై పూర్తి స్థాయి చర్చ అవసరంమని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ పార్టీలు గవర్నర్ పదవిని ప్రశ్నిస్తున్నప్పటికీ, గవర్నర్షిప్ రాజ్యాంగబద్ధంగా సృష్టించడం జరిగింది. కాబట్టి దీనిని ప్రశ్నకు అతీతంగా చూడాలి.