కాపరికి కరోనా రావడంతో 50 గొర్రెలు, మేకలను ఐసోలేషన్లో ఉంచారు అధికారులు. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. తుమ్కూర్ జిల్లాలోని గోడేకోర్ గ్రామంలో కాపరికి ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు చికిత్స కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఇక ఆ తరువాత అతడు కాస్తున్న గొర్రెలు, మేకల్లో శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నట్లు గ్రహించిన గ్రామస్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో అధికారులకు సమాచారం అందించారు.
దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. గొర్రె కాపరికి చెందిన కొన్ని మేకలు, గొర్రెలు శ్వాసకోశ సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయం ఉండటంతో జంతువులకు కూడా కరోనా సోకిందేమోనని గ్రామస్థులు భయపడ్డారు అని అన్నారు. ఇక ఈ విషయం కాస్త కర్ణాటకలోని మంత్రి జేసీ మధు స్వామి దగ్గరకు చేరగా.. దీనిపై విచారణ ప్రారంభించాలని ఆయన పశు సంవర్ధక అధికారులను ఆదేశించారు. దీంతో వారు గ్రామానికి వెళ్లి శాంపిల్స్ను తీసుకున్నారు.
అయితే ఆ జంతువులు ప్లేగు, మైకో ప్లాస్మా ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్నాయని పశు వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇక శాంపిల్స్ను భోపాల్లోని వెటర్నరీ లాబోరేటరీకి పంపినట్లు ఓ అధికారి తెలిపారు. గొర్రెలు, మేకల్లో కరోనా లక్షణాలు కనిపించలేదని ఆయన అన్నారు. అయితే ప్లేగు, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్లు సీజనల్ వ్యాధులని.. ఇవి మిగిలిన జంతువులకు సోకే ప్రమాదం ఉందని.. అందుకే వాటిని క్వారంటైన్లో పెట్టామని అన్నారు.