బిల్లుపై రాజకీయమా ? హవ్వ ! అమిత్ షా

|

Dec 11, 2019 | 1:17 PM

ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును విపక్షాలు రాజకీయం చేయజూస్తున్నాయని, అయితే ఈ విధమైన బిల్లును తెస్తామని ఎన్నికల సందర్భంలో తమ పార్టీ మేనిఫెస్టో లో హామీ ఇచ్చామని ఆయన అన్నారు. ఈ దేశ ప్రజలు మాకు, ఈ మేనిఫెస్టోకు అనుకూలంగా ఓటు చేశారన్న విషయం తెలిసిందేనన్నారు. ఈ బిల్లు వల్ల ఇక్కడి మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని […]

బిల్లుపై రాజకీయమా ? హవ్వ ! అమిత్ షా
Follow us on

ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును విపక్షాలు రాజకీయం చేయజూస్తున్నాయని, అయితే ఈ విధమైన బిల్లును తెస్తామని ఎన్నికల సందర్భంలో తమ పార్టీ మేనిఫెస్టో లో హామీ ఇచ్చామని ఆయన అన్నారు. ఈ దేశ ప్రజలు మాకు, ఈ మేనిఫెస్టోకు అనుకూలంగా ఓటు చేశారన్న విషయం తెలిసిందేనన్నారు. ఈ బిల్లు వల్ల ఇక్కడి మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పిన ఆయన.. పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలో మైనారిటీలుగా ఉన్న హిందువులు, బౌధ్ధులు, జైనులు, క్రైస్తవులు, సిక్కుల వంటి వారికి భద్రత లేదని, వారు ఆయా దేశాల్లో వేధింపులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారికి అక్కడ సమానత్వ హక్కులు లేవని, వారిని ఆ దేశాల ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని అమిత్ షా చెప్పారు.

అక్కడి లక్షలాది ముస్లిమేతరులకు ఈ బిల్లు ఆశాకిరణం అని ఆయన అభివర్ణించారు. లోక్ సభలో ఈ బిల్లును ఆమోదించిన సంగతి విదితమే.. దిగువ సభలో పాలక బీజేపీ, దాని మిత్ర పక్షాలకు మెజారిటీ ఉన్న కారణంగా బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, ప్రతికూలంగా 80 ఓట్లు వచ్చాయి. కానీ రాజ్యసభలో పరిస్థితి వేరు.. 240 మంది సభ్యులున్న ఈ సభలో మెజారిటీ మార్క్ 121. అన్నా డీఎంకె, జేడీ-యు, అకాలీదళ్ వంటి మిత్ర పక్షాలతో కూడిన ఎన్డీయేకి 116 మంది సభ్యులున్నారు. బిల్లు నెగ్గాలంటే మరో అయిదుగురి మద్దతు అవసరమవుతుంది. ఈ బిల్లును నిరసిస్తూ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.

‘ పాకిస్తాన్ లా మాట్లాడుతున్నారు ‘
పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని పార్టీలు పాకిస్తాన్ లా మాట్లాడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. బుధవారం పార్లమెంట్  హౌస్ లో తమ పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఈ బిల్లును స్వర్ణాక్షరాలతో లిఖించవలసి ఉందని, ఇది పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులను ఎదుర్కొంటున్న ముస్లిమేతరులకు పెద్ద రిలీఫ్ అని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు దీనిపై పాక్ లా మాట్లాడుతున్నాయన్న విషయాన్ని మన పార్టీ ఎంపీలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మోదీ సూచించారు.