గుజరాత్ తీరంలో పాక్ పడవలు కలకలం రేపాయి. భారత్-పాక్ సరిహద్దుకు సమీపంలో గల హరామి నాలా క్రీక్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 10.45 నిమిషాలకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గస్తీ చేపట్టింది. ఈ సమయంలో పాకిస్థాన్కు చెందని అయిదు పడవలను గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది. పడవల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువలేమీ లభించలేదని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
కాగా, జమ్ముకశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి భారత్కు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. దీంతో తీర ప్రాంతాలు, సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా బలగాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ తీరానికి అత్యంత సమీపంలో పాక్ పడవలు అనుమానాస్పదంగా కన్పించడం కలకలం రేపింది.