కేంద్రానికి ’సుప్రీం‘ షాక్ .. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై స్టే.. ఇక ప్రత్యేక కమిటీ ముందు వాదనలు

|

Jan 12, 2021 | 2:24 PM

అత్యంత చర్చనీయాంశంగా మారిన కొత్త వ్యవసాయ చట్టాలను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది..

కేంద్రానికి ’సుప్రీం‘ షాక్ ..  కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై స్టే.. ఇక ప్రత్యేక కమిటీ ముందు వాదనలు
Follow us on

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఇటీవల కాలంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన కొత్త వ్యవసాయ చట్టాల అమలును నిలిపి వేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మంగళవారం జరిగిన సదీర్ఘ వాదోపవాదాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. అయితే, రైతు చట్టాలపై సమగ్ర చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. తమకున్న హక్కులకు అనుగుణంగా రైతు సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే పేర్కొన్నారు.

వ్యవసాయ చట్టాల చట్టబద్ధత, దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల కారణంగా ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. రైతులు.. కమిటీ వద్దకు వెళ్లాల్సిన దానిపై వాదనలు తాము వినదలచుకోలేదన్న దర్మాసనం.. రైతులు నిరవధిక ఆందోళనలు చేయదలచుకుంటే చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

అయితే ఈ విష‌యంలో తాము ప్రధానికి ఎటువంటి దిశానిర్దేశం చేయ‌లేమ‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే పేర్కొన్నారు. రైతు సంఘాల‌తో ఇద్దరు కేంద్ర మంత్రులు చ‌ర్చించిన‌ట్లు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ హారీశ్ సాల్వే తెలిపారు. ప్రస్తుతానికి వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను స‌స్పెండ్ చేస్తున్నామ‌ని, కానీ శాశ్వతంగా ఆ చ‌ట్టాల‌ను స‌స్పెండ్ చేయ‌లేమ‌ని సీజే తెలిపారు.

క‌మిటీ ఏర్పాటు ప్రక్రియ‌ను సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ హారీశ్ సాల్వే స్వాగ‌తించారు. రాజకీయ ల‌బ్ది కోసం న్యాయ విధానం సాగ‌వ‌ద్దన్నారు. కేవ‌లం ఉద్రిక్తత‌లను త‌గ్గించేందుకు, ఉత్సాహాన్ని నింపేందుకు చ‌ట్టాల‌పై స‌స్పెన్షన్ విధిస్తున్నట్లు హ‌రీశ్ సాల్వే తెలిపారు. త‌దుప‌రి ఆదేశాల వ‌చ్చే వ‌ర‌కు సాగు చ‌ట్టాల‌పై స్టే కొన‌సాగుతుంద‌ని సుప్రీం పేర్కొంది.

న్యాయ క‌మిటీలో న‌లుగురు స‌భ్యులు ఉండ‌నున్నారు. వ్యవ‌సాయ నిపుణుల‌తో క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్నారు. రైతు సమస్యల పరిష్కారానికి మాత్రమే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. కమిటీ సభ్యులుగా హరి సిమ్రత్ మన్, అశోక్ గులాటి, ప్రమోద్ కుమార్ జోషి, అనిల్ ధన్వత్‌‌ ఉంటారని సుప్రీంకోర్టు తెలిపింది. సమస్య పరిష్కారం కావాలనుకునే వారంతా కమిటీని సంప్రదించాలని సూచించింది. రైతులు నేరుగా లేదా తమ తరఫున న్యాయవాదుల ద్వారా సమస్యలను కమిటీకి వివరించాలని తెలిపింది.