తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అమిత్ షా కార్యాచరణ రూపొందించారని, దాన్ని తనకు వివరించారని చెప్పారు. అమిత్ షా పిలుపు మేరకు తాను ఢిల్లీ వచ్చానని, ఆయనతో దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యానని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకువచ్చే కార్యాచరణపై చర్చించామన్నారు.
శనివారం అమిత్ షా కార్యాలయం నుంచి ఈటలకు పిలుపు రావడంతో హుటాహుటిన హస్తినకు వెళ్లారు. అయితే ఆదివారం అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశయ్యారు ఈటల. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
వచ్చే నెల హైదరాబాద్లో జరగనున్న బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో లేదంటే అంతకంటే ముందే ప్రకటించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలోనే ఈటలకు పార్టీ పదవి అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపు కోసం అధికార పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ 23వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఈటలకే విజయం కట్టబెట్టారు. ఇది ఈటల బలమైన నాయకత్వం వల్లే సాధ్యమైంది. కానీ ఆయన పార్టీలో కొద్ది రోజులుగా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనేది ఇన్సైడ్ టాక్. అందుకే ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేలా జాతీయ స్థాయి పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అమిత్ షా కార్యాచరణ రూపొందించారని.. దాన్ని ఈటలకు వివరించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేంద్ర నాయకత్వం.. తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో వరుసగా పర్యటించడమే కాకుండా.. జాతీయ కార్యవర్గాలు సైతం హైదరాబాద్లో నిర్వహించబోతోంది. జులై 3న భారీ బహిరంగ సభ నిర్వహించి.. పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నంలో ఉంది. ఇలాంటి సమయంలో ఈటల లాంటి నేతలకు పదవులు ఇస్తే పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని పార్టీ అంచనా వేస్తోంది.