Bird Flu in 12 States: మనదేశంలో ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తుంటే.. మరోవైపు బర్డ్ ఫ్లూ పంజా విసురుతుంది. రాజస్తాన్ లో కాకుల మరణంతో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ తాజాగా 12 రాష్ట్రాల్లోకి విస్తరించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ చత్తీస్గఢ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, పంజాబ్ల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని చెప్పింది.
అయితే హరియాణా, మహారాష్ట్ర, కేరళ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో మాత్రమే కోళ్లఫారాల్లో ఏవియన్ ఫ్లూ నిర్ధారణ అయింది. కేరళ, మహారాష్ట్రల్లో రోజు రోజుకీ ఈ వైరస్ సోకిన కోళ్లఫారాల సంఖ్య పెరుగుతుందని.. కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం పెంచేలా అన్నిరకాలుగా ప్రచారంచేస్తున్నామని చెప్పింది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా సవరగఢ్లో మంగళవారం సుమారు 3700 పక్షులు చనిపోయాయని అక్కడి అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లోని కోళ్ల కల్లింగ్ ను చేపట్టామని చెప్పారు. ఇప్పటికే కేరళ బర్డ్ ఫ్లూ పై ఎలర్ట్ ప్రకటించింది. కోళ్లఫారాల యజమానులను అప్రమత్తం చేసింది.
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పలు పార్కుల్లో వెలుగు చూసిన బర్డ్ ఫ్లూ.. తాజాగా ఎర్రకోట వద్ద కూడా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. జనవరి 10న ఎర్రకోట వద్ద చనిపోయిన కాకులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో, ఎర్రకోటను జనవరి 26 వరకు మూసివేస్తున్నామని అధికారులు చెప్పారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాను నిలిపివేశాయి. ఈ వ్యాధి వ్యాపించడానికి ప్రధాన కారణం వలస పక్షులే అని అధికారులు చెప్పారు.
Also Read: రామమందిర నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలని బండి సంజయ పిలుపు..