Covid Vaccination: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి విజృంభించగా, ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి తీసుకున్న చర్యల వల్ల ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. అయితే దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీంతో దేశమంతటా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా టీకాలు వేయించుకుంటున్నారు. నేటితో భారత్లో కరోనా టీకాల డోసులు 100 కోట్లకు చేరుకోనున్నాయి. 130 కోట్ల భారతావనిలో ఇప్పటివరకు 70 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా మొదటి డోసు, 29 కోట్ల మంది ప్రజలు సెకండ్ డోస్లను వేయించుకున్నారు.
ఇక భారతదేశంలోజనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ మేరకు కోవిన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సినేషన్పై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చేస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకు రాష్ట్రాలు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. డిసెంబర్ 31 లోగా అర్హులైన వారందరికీ కరోనా టీకాలను అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 20తో వ్యాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల డోసులకు చేరుతుండటంతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాలను చేపట్టేందుకు రెడీ అయిపోయింది. కాగా ప్రస్తుతంలో దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వంటి కరోనా టీకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ టీకాలను ఉచితంగా అందిస్తుండగా.. ప్రైవేట్ సెక్టారులో మాత్రం నిర్దిష్టమైన ధరలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇక దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వంతు పాత్ర పోషించాయి. అయితే, ఇందులో పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే చిన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్లో మిన్నగా ఉన్నాయి. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, గోవా, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, చండీగఢ్, లక్షద్వీప్ వంటి చోట్ల 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేసుకోవడం గమనార్హం. అలాగే గుజరాత్, కేరళ, దిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో సైతం దాదాపు 90 శాతం మంది మొదటి తొలి డోసు వేసుకున్నారు.
ప్రస్తుతం కోవిడ్ దేశంలో బలహీనపడిందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారని, దీంతో ప్రతి ఒక్కరిలో ఇమ్యూనిటీ పవర్ పెరిగిందని వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న కారణంగా వైరస్ను అడ్డుకునేందుకు రోగనిరోధక శక్తి ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొంటున్నారు. ఈ మహమ్మారి సాధారణ వ్యాధిలా బలహీనపడిందని స్పష్టం చేస్తున్నారు.