Ambani, Mittal differ on 5G rollout timeline భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సును డిసెంబర్ 8న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… దేశం టెలికాం రంగంలో దూసుకుపోతోందని మెచ్చుకున్నారు. నగదు బదిలీ విధానానికి మొబైల్స్ బాగా ఉపయోగపడుతున్నాయని కితాబిచ్చారు. అయితే ఐఎంసీ వేదికగా టెలికాం సంస్థలు పరస్పర విరుద్ధ వాదనలకు దిగాయి.
దేశంలో 5జీ సేవలకు సంబంధించి ప్రత్యేక ప్రమానాలు అవసరం లేదని భారతి ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ అన్నారు. ప్రత్యేక వ్యవస్థల కారణంగా అంతర్జాతీయ వ్యవస్థలో భారత్ భాగమయ్యే అవకాశం కోల్పోతుందని అన్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఆవిష్కరించబడే అభివృద్ధి ప్రక్రియ దేశంలో మందగించే అవకాశం ఉంటుందని అన్నారు. 5జీ సేవలు భారత్లో అందుబాటులోకి రావాలంటే రెండు, మూడు ఏళ్లు పడుతుందని అన్నారు.
5 జీ సేవలను వీలైనంత త్వరగా ప్రవేశపెడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. చౌకగా 5జీ సేవలను అందించేందుకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. అందుకోసం దేశీయంగా 5జీ సేవల విస్తరణ కోసం అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అదే అసలైన ఆత్మ నిర్భర్ భారత్కు అసలైన అర్థం అని అన్నారు.
భారతి ఎయిర్టెల్ సీఈవో విఠల్ 5జీ వ్యవస్థను అందుబాటులోకి తేవాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుందనగా… ముకేశ్ అంబానీ మాత్రం 2021 జూన్ నాటికి అంటే ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తాం అని అన్నారు. దీంతో దేశీయంగా ఉన్న టెలికాం దిగ్గజ సంస్థల అధినేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు.