కరోనా వైరస్ పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. చైనాలో పురుడు పోసుకున్న ఈ రాకాసి వైరస్.. క్రమేపీ ఇతర దేశాలను కూడా తాకుతోంది. జపాన్లోని జపాన్లోని యొకొహమా పోర్టులో నిలిపివేసిన ‘డైమండ్ ప్రిన్సెస్’ ఓడలో ఉన్న వారిపై కూడా కరోనా పంజా విసిరింది. జపాన్కు చెందిన విహార నౌక “డైమండ్ ప్రిన్సెస్”లో నుంచి హాంగ్కాంగ్లో దిగిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. దీంతో ఫిబ్రవరి 3 నుంచి ఆ షిప్ను యొకొహమా పోర్ట్లోనే నిలిపేశారు. దీంట్లో మొత్తం 3700 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 138 మంది భారతీయ ప్రయాణికులు, సిబ్బంది కూడా ఉన్నారు.
అయితే ఇందులో ఇద్దరు భారతీయులు కొవిడ్-19 (కరోనా వైరస్) బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. షిప్లో ఉన్న భారతీయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు జపాన్లోని భారత రాయబార కార్యాలయ అధికారులు వెల్లడించారు. కాగా.. ఇప్పటి వరకు ఓడలో ఉన్న 3700 మందిలో 174 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. మరో వారం వరకు (ఫిబ్రవరి 19) షిప్లో ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఇప్పటికే షిప్లో చెఫ్గా పనిచేస్తున్న మన దేశస్థుడు వినయ్ కుమార్ సహా మరో యువతి తమను రక్షించాలంటూ.. సోషల్ మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.