కొత్త సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. కీలక అనుమతులు మంజూరు చేసిన కేంద్రం పర్యావరణ శాఖ
తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్. కేంద్ర అటవీ - పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది.
green signal for telangana new secretariate: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. కేంద్ర అటవీ – పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. దీంతో భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన కొత్త సచివాలయానికి మార్గం సుగమమైంది. నూతన సచివాలయానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు జారీ చేసింది. దీంతో భవన నిర్మాణ పనులు వేగంగా మొదలు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. అనేక న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తూ తెలంగాణలో కొత్త సచివాలయ పరిపాలన భవనానికి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. మొత్తం రూ. 400కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర సెక్రటరియేట్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి పరిపాలనాపరమైన అనుమతులను జారీ చేసింది కేంద్రం.
ఇదిలావుంటే, చెన్నైకు చెందిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ ఈ భవన సముదాయానికి రూపకల్పన చేసింది. ప్రస్తుతం సచివాలయం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే పూర్తి అవ్వగా దాని స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత ఆధునాతన టెక్నాలజీ సాయంతో 2021 అక్టోబర్ నాటికి కొత్త సచివాలయాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణానికి అనుమతులన్నీ రావడంతోనే భవన నిర్మాణ పనులను వేగవంతం చేయనుంది ఆర్అండ్ బీ శాఖ. ఈ మేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులను ఇచ్చింది.