ప్రస్తుతం కాలం మారి పోయింది. ఒకప్పుడు రాత్రుళ్లు త్వరగా పడుకునే వారు. వీలైనంత వరకు రాత్రి 8 గంటకల్లా తినేసి 9 గంటలకే పడుకునే వారు. కానీ ప్రస్తుతం ఉద్యోగాల శైలి మారింది, జీవన విధానం మారింది. స్మార్ట్ ఫోన్లు, ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. కొందరు పనుల్లో బిజీగా ఉంటే మరికొందరు స్మార్ట్ ఫోన్లతో కుస్తీలు పడుతున్నారు. దీంతో ఆలస్యంగా నిద్రపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ముఖ్యంగా రాత్రి 11 గంటల తర్వాత కూడా మేలుకవతో ఉండే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇలా ఆలస్యంగా నిద్ర పోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మన శరీర గడియారం దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మన శరీర గడియారం మనకు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కొవాలనే విషయాలను తెలుపుంది. అయితే ఇష్టం వచ్చిన సమయంలో పడుకొని, ఇష్టం వచ్చిన సమయంలో నిద్రలేస్తే సహజ టైమర్కు అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు.
ఇది మన శారీరక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. నిత్యం అలసిపోయినట్లు అనిపించడం, బరువు పెరగడంతో పాటు నిత్యం వ్యాధుల బారిన పడడం వంటి సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇది మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. ఆలస్యంగా నిద్రపోయే వారిలో ఆందోళన, నిరాశ సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జనరల్ మెడికల్ సైన్సెస్ ప్రకారం జీవ గడియారంలో మార్పులు వచ్చే రోగ నిరోధక వ్యవస్థపై నేరుగా ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
ఇక వేక్ఫిట్కి చెంది ‘ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్’ నివేదిక ప్రకారం, భారతదేశంలో 58% మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారని తేలింది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడానికి ప్రధాన కారణాల్లో స్మార్ట్ ఫోన్, టీవీలు, గ్యాడ్జెట్స్గా చెబుతున్నారు. సుమారు 88 శాతం మంది భారతీయులు పడుకునే ముందు ఫోన్ను పట్టుకుంటున్నారని తేలింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్ వంటి నగరాల్లో అర్థరాత్రి వరకు డ్యూటీలు ఉండడం కూడా వారి నిద్ర వేళల్లో మార్పులకు కారణంగా చెబుతున్నారు. భారదేశంలో సుమారు 30 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..