సంతానలేమి ఇటీవల ఈ సమస్య ఎక్కువుతోంది. ఒకప్పుడు సంతానలేమి సమస్య అంటే కేవలం మహిళల్లో ఎదురయ్యే సమస్యగానే భావించేవారు. కానీ ప్రస్తుతం ఈ సమస్య పురుషుల్లోనూ పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది పురుషుల్లో సంతాన లేమి సమస్య పెరుగుతోంది. తీసుకునే ఆహారంలో పురుషుల్లో శుక్రకణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అనారోగ్యకరమైన లైఫ్స్టైల్, చెడు అలవాట్ల కారణంగా మగవాళ్లలో శుక్రకణాల డీఎన్ఏను దెబ్బ తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్మోకింగ్ చేసేవారిలో, ఆల్కహాల్ తీసుకునే వారితో పాటు అధిక మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే వారిలో శుక్రకణం నాణ్యత దెబ్బతింటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది పుట్టబోయే పిల్లలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందుకే తండ్రి కావాలనుకునే వారు ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లల్ని ప్లానింగ్ చేసే కనీసం ఆరు నెలల ముందు నుంచి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు.
శుక్రకణాల డీఎన్ఏ దెబ్బతిన్న వారికి జన్మించే పిల్లల్లో పుట్టుకతోనే లోపాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే పురుషుల్లో వంధ్యత్వం, గర్భస్రావాలు వంటివి శుక్ర కణాల్లో డీఎన్ఏ దెబ్బతినడం వల్లే సంభవిస్తాయని చెబుతున్నారు. ఈ విషయమై ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన డాక్టర్ రీమా దాదా మాట్లాడుతూ.. గర్భధారణ, పిండం అభివృద్ధిలో తండ్రి పాత్రను విస్మరించలేమని అన్నారు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యం తండ్రి శుక్రకణాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా చేసే అలవాటుతో మైటోకాండ్రియల్, న్యూక్లియర్ డీఎన్ఏల సమగ్రతను పెంచుతుందని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక తండ్రి కావాలనుకునే వారు కనీసం ఆరు నెలల ముందు నుంచి జీవనశైలిలో మార్పు చేసుకొని. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శుక్రకణాల నాణ్యత పెరిగేందుకు కోడిగుడ్డు, పుచ్చకాయ, బాదం, పాలకూర వంటి ఆహారాలను డైట్లో భాగం చేసుకోవాలి. అదే విధంగా యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటి వాటిని అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..