ప్రతీ ఒక్కరి వంటింట్లో కచ్చితంగా ఉండే వాటిలో బిర్యానీ ఆకుల ఒకటి. బిర్యానీలు మొదలు వంటల్లో రుచి కోసం బిర్యానీ ఆకును ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం వంటకు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా బిర్యానీ ఆకుతో టీ చేసుకొని తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బిర్యానీ ఆకుతో చేసిన టీలో ఎన్నో పోషకాలు ఉంటాయి. సాధారణ టీని వదిలేసి బిర్యానీ ఆకులతో చేసిన టీ తాగడం వల్ల శరీరంలో వెంటనే మార్పులు ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటి.? అసలు బిర్యానీ ఆకు టీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..
బిర్యానీ ఆకు టీ తయారు చేసుకోవడానికి ముందుగా నాలుగు ఆకులు తీసుకోవాలి. స్టౌ వెలిగించి గిన్నెపెట్టి అందులో గ్లాసు నీళ్లు పోయండి. నీరు వేడి అయ్యాక అందులో బిర్యానీ ఆకులు వేసి బాగా మరగనివ్వాలి. అనంతరం స్టౌ ఆఫ్ చేసి వడ కట్టుకొని తాగేయొచ్చు. ఇది కాస్త ఘాటూగా ఉంటుందని అనిపిస్తే అందులో నిమ్మరసం లేదా తేనె కలుపుకొని తీసుకోవాలి. ఇలా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకుంటే శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి బిర్యానీ ఆకులు బాగా ఉపయోగపడుతాయి. ఇలాంటి వారు రోజుకు ఒకసారి బిర్యానీ టీని తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే గంట ముందు ఈ టీ తాగడం ద్వారా శరీరం రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గి మెదడు ప్రశాంతంగా మారి హాయిగా నిద్రపడుతుంది. ఇక బిర్యానీ ఆకులతో చేసే టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను దూరం చేస్తుంది. ఇక ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల సమస్యలు ఉన్న వారు కూడా బిర్యానీ ఆకులతో చేసిన టీని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
బిర్యానీ ఆకులతో చేసే టీలో రుతిన్, కెఫిక్ యాసిడ్ అనే రెండు సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె గోడలను బలోపేతం చేయడంలో, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. బిర్యానీ ఆకులతో చేసిన టీని తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కణజాలాలు దెబ్బతినడం తగ్గుతుంది. ఇక షుగర్ పేషెంట్స్ సైతం ఈ టీని తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ని నియంత్రిస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..