ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించిన కీళ్ల నొప్పులు సమస్యలు ప్రస్తుతం చిన్న వయసులో వారిలో కూడా కనిపిస్తున్నాయి. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంది. ముఖ్యంగా పోషకాహార లోపం కారణంగానే కీళ్ల నొప్పుల సమస్య వస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు ఆహారంలో 5 రకాల పదార్థాలను కచ్చితంగా చేర్చుకోవాలని. దీంతో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* కీళ్ల నొప్పులు వేధిస్తుంటే టొమాటోను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి, పొటాషియం కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది.
* వంటింట్లో కచ్చితంగా ఉండే పసుపు కూడా కీళ్ల సమస్యలను దూరం చేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉండే పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. పసుపును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, కండరాల వాపు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు.
* బచ్చలికూరలో విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా బచ్చలికూరలో ఉండే పోషకాలు శరీరంలో మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వాపును తగ్గించడంలో కూడా మేలు చేస్తాయి.
* కీళ్ల నొప్పులను తగ్గించడంలో పైనాపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ మంటను తగ్గించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. శస్త్రచికిత్స తర్వాత వచ్చే వాపును తగ్గించడానికి బ్రోమెలైన్ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
* సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..