గత కొద్దిరోజులుగా ఏపీలో అధికార వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం కలకలం రేపుతోంది. పార్టీలో కుల రాజకీయాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే ఆయనకు పొసగడం లేదు. మాటలతో వాడీ, వేడీ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ అధిష్ఠానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అనేక సందర్భాల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆ నోటీసులో పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు కూడా వారంలోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు స్పందించారు.
తనకు బుధవారం మధ్యాహ్నం 18 పేజీల నోటీసు షోకాజ్ నోటీసు వచ్చిందని తెలిపారు. అందులో రెండు పేజీలు రిటన్ షోకాజ్ కాగా, మరో 16 పేజీలు పేపర్ క్లిపింగ్స్ ఉన్నాయని వెల్లడించారు. తాను పార్టీని కానీ, పార్టీ అధ్యక్షుడిని కానీ పల్లెత్తు మాట అనలేదని వివరించారు. ప్రభుత్వం ప్రజల మంచి కోసం చేపట్టిన కొన్ని పథకాల్లో పనులు సజావుగా జరగని విషయాన్ని.. ముఖ్యమంత్రి గారి అప్పోయింట్మెంట్ దొరకని కారణంగా మీడియా ముఖంగా సూచనలు చేసినట్టు వివరించారు. తనకు నోటీసుపై వివరణకు వారం రోజులు సమయం ఉన్నా రేపు సమాధానం చెబుతానని పేర్కొన్నారు.