డ్రోన్ల అమ్మకాలపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గంటకు 800 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే సామర్థ్యమున్న డ్రోన్ల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ (MTCR) చట్టాన్ని సవరించింది. గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే డ్రోన్లను ఇప్పటివరకు బ్రిటన్, ఫ్రాన్సు, ఆస్ట్రేలియాలకు మాత్రమే అమెరికా విక్రయించింది. ఇక ముందు తమ మిత్ర దేశాలకు కూడా వాటిని అందించాలని నిర్ణయం తీసుకుంది.
అమెరికా మిత్రదేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్టులతోపాటు ముఖ్యంగా భారత్కు ఈ డ్రోన్ లను అందించనుంది. లిబియా, యెమెన్ అంతర్యుద్ధంలో వివిధ పక్షాలు వాడుతున్న చైనా డ్రోన్లకు దీటుగా మిత్ర దేశాలకు వీటిని విక్రయించాలని కూడా అమెరికా ప్లాన్ చేస్తోంది.
‘800 కిలోమీటర్ల నిబంధన’ను చైనా అనుకూలంగా మార్చుకుని, డ్రోన్ల తయారీ భారీగా చేపట్టి, మార్కెట్ అవకాశాలను పెంచుకుంది. అదే సమయంలో అమెరికా డ్రోన్ పరిశ్రమ అవకాశాలను కోల్పోతూ వచ్చింది. అమెరికా మిత్ర దేశాలైన ఈజిప్టు, సౌదీ అరేబియాలకు సైతం చైనా ఇలాంటి డ్రోన్లను అమ్మింది. అయితే ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయం డ్రాగన్ కంట్రీకి పెద్ద దెబ్బ పడనుంది. ఆయుధాల విక్రయాలతో చైనాను దెబ్బకొట్టేందుకు ప్రపంచ పెద్దన్న ప్లాన్ చేస్తోంది.