నాటకీయ పరిణామాల మధ్య శాసన మండలిలో టీడీపీ ప్రవేశపెట్టిన రూల్ 71 తీర్మానం నెగ్గింది. చర్చ జరిగిన అనంతరం ఛైర్మన్ షరీఫ్ ఓటింగ్ నిర్వహించారు. రూల్ 71కు అనుకూలంగా 27, వ్యతిరేకంగా 13, తటస్థంగా 9 ఓట్లు పడ్డాయి. ఇద్దరు టీడీపీ సభ్యులు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో టీడీపీ షాక్ తింది. సభ ప్రారంభం కాగానే రూల్ 71 కింద శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార వైసీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులు ప్రవేశపెట్టేముందు రూల్ 71 కింద తీర్మానం పెట్టడం సంప్రదాయాలకు విరుద్ధమని వైసీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బిల్లులపై చర్చ జరపాలంటూ అధికార పక్షం, రూల్ 71పై అంటూ ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది.
అనంతరం ప్రతిపక్ష సభ్యుల సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో రూల్ 71పై చర్చకు ఛైర్మన్ షరీఫ్ అనుమతించారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చర్చను ప్రారంభించగా.. ఆ పార్టీకి చెందిన మరికొంతమంది సభ్యులు కూడా మాట్లాడారు. చర్చ అనంతరం ఛైర్మన్ ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్లో టీడీపీకి అనుకూలంగా 27, వైసీపీకి అనుకూలంగా 13 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ప్రవేశపెట్టిన రూల్ 71 తీర్మానం నెగ్గినట్లయింది. అయితే – ఓటింగ్ సందర్భంగా టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు గట్టి షాక్ ఇచ్చారు. సొంత పార్టీకే వ్యతిరేకంగా ఓటు వేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్రెడ్డి వైసీపీకి అనుకూలంగా ఓటేశారు. ఓటింగ్ అనంతరం సభను మర్నాటికి వాయిదా వేశారు.
మరోవైపు రూల్ 71 తీర్మానం ఆమోదం పొందడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుల చర్చ జరిగే అవకాశం ఉందా… లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మండలి సమావేశంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనే విషయం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. మండలిలో జరిగే పరిణామాలను బట్టి… అసెంబ్లీలో ప్రభుత్వం వ్యూహరచన చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.