రెండు పార్టీల్లో ఆ ఇద్దరు ఓ స్పెషల్.. వీడరు..తగ్గరు..ఏంటో స్పెషల్?

|

Feb 11, 2020 | 4:24 PM

అవడానికి ఆ రెండు పార్టీలు రాజకీయ ప్రత్యర్థులే.. ఇంకా చెప్పాలంటే వైరి పక్షాలు అని కూడా అనొచ్చు. కానీ ఆ రెండు పార్టీలను ఒకే రకమైన సమస్య వేధిస్తోంది. సమస్య తీవ్రంగానే వుంది. దాని ప్రకంపనలు కూడా గట్టిగానే వున్నాయి. కానీ చర్య తీసుకునేందుకు రెండు పార్టీ అధినేతలు ధైర్యం చేయడం లేదు. ఎందుకు? కొరకరాని కొయ్యలుగా మారిన ఇద్దరిపై చర్య తీసుకునేందుకు రెండు పార్టీల అధినేతలు ఎందుకు జంకుతున్నారు? హియర్ ఈజ్ ది రీజన్. పార్టీలోనే […]

రెండు పార్టీల్లో ఆ ఇద్దరు ఓ స్పెషల్.. వీడరు..తగ్గరు..ఏంటో స్పెషల్?
Follow us on

అవడానికి ఆ రెండు పార్టీలు రాజకీయ ప్రత్యర్థులే.. ఇంకా చెప్పాలంటే వైరి పక్షాలు అని కూడా అనొచ్చు. కానీ ఆ రెండు పార్టీలను ఒకే రకమైన సమస్య వేధిస్తోంది. సమస్య తీవ్రంగానే వుంది. దాని ప్రకంపనలు కూడా గట్టిగానే వున్నాయి. కానీ చర్య తీసుకునేందుకు రెండు పార్టీ అధినేతలు ధైర్యం చేయడం లేదు. ఎందుకు? కొరకరాని కొయ్యలుగా మారిన ఇద్దరిపై చర్య తీసుకునేందుకు రెండు పార్టీల అధినేతలు ఎందుకు జంకుతున్నారు? హియర్ ఈజ్ ది రీజన్.

పార్టీలోనే వుంటారు. కానీ అధినేతల అభిమతానికి భిన్నంగా తరచూ మాట్లాడతారు. ఇంకో అడుగు ముందుకేసి ప్రత్యర్థి పార్టీల అధినేతలతో ఒకరు అప్పుడప్పుడు.. మరొకరు తరచూ కలుస్తూ వుంటారు. ఇద్దరూ వ్యాపారరంగానికి చెందిన వారే. రాజకీయాలకు వారికి ఒక్కోసారి పార్ట్ టైమ్.. ఇంకోసారి ఫుల్ ‌టైమ్. వారే… కేశినేని నాని(తెలుగుదేశం) రఘురామకృష్ణంరాజు(వైసీపీ).

కేశినేని రూటే సెపరేటు

మే నాటి జనరల్ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచే టీడీపీలో కేశినేని నాని వార్తల్లో వ్యక్తిగా మారారు. ట్వీట్లతో పార్టీ నేతలకు కంటగింపుగా వ్యవహరించారు. కొన్ని ట్వీట్లతో సాక్షాత్తు అధినేత చంద్రబాబు సైతం ఇబ్బంది పడ్డారు. కానీ కేశినేనిపై చర్య తీసుకునేందుకు చంద్రబాబు సిద్దపడలేదు. సొంత పార్టీ నేతలపై సెటైర్లు వేస్తూ.. కొన్ని సార్లు పార్టీ విధానాలకు సైతం చురకంటించిన కేశినేని ఒక దశలో పార్టీని వీడడం ఖాయమనే అందరూ అనుకున్నారు.

రెండు, మూడు నెలలపాటు రెచ్చిపోయిన కేశినేని నాని కారణమేంటో గానీ.. ఆ తర్వాత పార్టీకి సహకరించడం మొదలుపెట్టారు. ఢిల్లీలో టీడీపీ విధానాలను ముందుకు తీసుకువెళ్ళడంలో మిగిలిన టీడీపీ ఎంపీలతో కలిసి పనిచేశారు. మధ్యలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లక్ష్యంగా కొన్ని ట్వీట్లు చేశారాయన. కేశినేనిలో ఈ మార్పేంటి అనుకునే లోపే.. మళ్ళీ పార్టీలో సంచలనం రేకెత్తించే మాటలతో తెరమీదికి వచ్చారు కేశినేని.

చంద్రబాబు హయాంలో ఐబీ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు యావత్ తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంటే కేశినేని మాత్రం ఆయన అవినీతిపరుడే అయితే చర్యతీసుకోవడం కరెక్టేనని ఓ డిబేట్‌లో అన్నారు. ఇంకో అడుగు ముందుకేసి.. ‘‘అవినీతిపరులకు అండగా నిలబడడమే పార్టీ విధానమైతే తాను అందుకు వ్యతిరేకం’’ అంటూ కుండబద్దలు కొట్టి తెలుగుదేశం అధినేతకు తలనొప్పి కలిగించారు.

రాజుగారి దారి.. రహదారి

వైసీపీ తరపున నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణంరాజు కూడా అధినేతకు తరచూ నెత్తినొప్పు పుట్టిస్తున్నారు. ఎంపీగా విజయం సాధించినప్పట్నించి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో తరచూ మమేకమవుతున్న రఘురామకృష్ణంరాజు.. ఒక్కోసారి పార్టీ అధినేతను ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలోని వాల్తేర్ క్లబ్‌ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే తాను ఊరికే వుండడనంటూ అటు టీడీపీ నేతలతోపాటు.. ఇటు సొంత పార్టీ నేతలకు హెచ్చరిక జారీ చేశారు.

ఢిల్లీలో ఎంపీలకు భారీ విందును ఏర్పాటు చేసిన రఘురామకృష్ణంరాజు విందు విషయంలో పార్టీ అధినేతకు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తరచూ కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్‌లతోపాటు.. బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డాతో రాజు భేటీ అవుతూనే వున్నారు. రఘురామకృష్ణంరాజు కల్వడం మొదలయ్యాక అమిత్‌షా లాంటి వారు.. విజయసాయిరెడ్డికి అపాయింట్‌మెంట్ ఇవ్వడంలో జాప్యం చేస్తుండడం పార్టీలో చర్చనీయాంశమైంది.

చర్యలెందుకుండవో?

ఈ ఇద్దరు నేతలపై చర్య తీసుకునే విషయంలో అటు జగన్‌ది.. ఇటు చంద్రబాబుది ఒకే విధానమని చెప్పుకుంటున్నాయి అమరావతి వర్గాలు. ఎందుకంటే ఇద్దరు నేతలది ఒకే నేపథ్యం. కేశినేని శ్రీనివాస్ (నాని), రఘురామకృష్ణంరాజు తొలుత వ్యాపారవేత్తలు.. ఆ తర్వాతే రాజకీయ నాయకులు. పూర్తి క్రమశిక్షణ ఆశించడం సాధ్యం కాదని అధినేతలు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఎంపీలుగా గెలిచిన వీరిద్దరిపై ఎలాంటి చర్య తీసుకున్నా.. వారికి ఛాన్స్ ఇచ్చినట్లవుతుందని అధినేతలు అంఛనా వేస్తున్నారు. అధినేతలకు, పార్టీకి కొరకరాని కొయ్యలుగా మారినా.. వారిని చూసి చూడనట్లు వదిలేయడమే జగన్, చంద్రబాబుల వ్యూహమని అంతా అనుకుంటున్నారు. అయితే.. దేనికైనా ఓ హద్దుంటుందని అది దాటితే చర్యలుండే అవకాశం వుందని పరిశీలకులంటున్నారు.