26/11 దారుణ మారణకాండకు నేటితో 12 ఏళ్లు..పాక్ కుట్రను మరిచిపోలేక పోతున్న భారతీయులు

|

Nov 26, 2020 | 11:36 AM

ముంబై..వాణిజ్య రాజధాని..ఆర్థికంగా దేశానికి అత్యంత ముఖ్యమైన నగరం. అలాంటి సిటీలో ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా ముష్కరమూకలు తెగబడే ప్రమాదముంది. 26/11 దారుణ మారణకాండకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి.

26/11 దారుణ మారణకాండకు నేటితో 12 ఏళ్లు..పాక్ కుట్రను మరిచిపోలేక పోతున్న భారతీయులు
Follow us on

ముంబై..వాణిజ్య రాజధాని..ఆర్థికంగా దేశానికి అత్యంత ముఖ్యమైన నగరం. అలాంటి సిటీలో ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా ముష్కరమూకలు తెగబడే ప్రమాదముంది. 26/11 దారుణ మారణకాండకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్‌ 26న జరిగిన మారణహోమాన్ని..ముంబై మహానగరం ఇప్పటికీ మరిచిపోలేదు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు సృష్టించిన నరమేథానికి 12 ఏళ్లు పూర్తైనా ఆనాటి గాయాలు ఇప్పటికీ మానలేదు. మరోసారి అలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు పోలీసులు.

ముంబై పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేశారు. ట్రైనింగ్‌, ఆయుధాల వాడకం, ఎలాంటి సమయంలోనైనా దాడుల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టే సామర్థ్యం వంటి విషయాల్లో ఎంతో పురోగతి సాధించారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్స్, ఆయుధాల్ని పెద్ద సంఖ్యలో సమకూర్చుకున్నారు. భద్రతా సిబ్బందిని గణనీయంగా పెంచకున్నారు.

ప్రమాదం పొంచి ఉన్నట్టు కంట్రోల్ రూం నుంచి ఫోన్ కాల్ వచ్చిన ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్‌ చేపట్టేలా ఏర్పాట్లు చేసుకున్నాయి భద్రతా సంస్థలు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 5వేల అత్యాధునిక ఆయుధాలు, బోట్లు సిద్ధంగా ఉంచారు. ఇక ఈ పన్నెండేళ్లలో ప్రజల ఆలోచనా విధానం కూడా మారింది. చాలా అలర్ట్‌గా ఉంటున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారు.

పన్నెండేళ్ల కిందట జరిగిన ఉగ్ర అరాచకం..ప్రపంచ ఉగ్ర దాడుల్లోనే అత్యంత ఘోరమైన చర్యగా నిలిచిపోయింది. పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి చొరబడ్డారు లష్కరే తోయిబా ఉగ్రవాదులు..అజ్మల్ కసబ్ సహా 10మంది ముష్కరులు..తాజ్‌, ఒబెరాయ్ హోటల్, చత్రపతి శివాజీ టెర్మినల్‌ దగ్గర నాలుగు రోజుల పాటు మారణకాండ సృష్టించారు. ఈ దాడిలో 166 మంది చనిపోగా, 3వందల మందికి పైగా గాయపడ్డారు. ఇలాంటి ఉగ్రదాడి మళ్లీ జరిగే పరిస్థితే రానివ్వబోమంటున్న ముంబై పోలీసులు..ఒకవేళ జరిగితే, అత్యంత అధునాతన ఆయుధాలతో తిప్పికొడతామంటున్నారు. పన్నెండేళ్లుగా నిఘా వర్గాల సమాచారాన్ని ఆధారంగా చేసుకొని చాలా ఉగ్రవాద కుట్రల్ని ఆదిలోనే ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఆ చేదు జ్ఞాపకానికి పన్నేండేళ్లు పూర్తైన సందర్భంగా..నాటి దాడుల్లో వీర మరణం పొందిన పోలీసులు, భద్రతా సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు గవర్నర్‌ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, పలువురు ఉన్నతాధికారులు. దక్షిణ ముంబైలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో కొత్తగా నిర్మించిన స్మారక స్థూపం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 26/11అమరవీరుల కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.