Trump dinner: ఫిబ్రవరి 25 న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ నిర్వహించిన విందుకు సంగీత విద్వాంసుడు ఎఆర్ రెహమాన్, ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెహ్మాన్, వికాస్ లు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషించారు. ప్రముఖులతో చిత్రాలకు కూడా పోజులిచ్చారు. ఆ చిత్రాలను వికాస్, రెహ్మాన్ ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
ఈ విందులో రెహ్మాన్, వికాస్లతో పాటు ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుడు కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్ ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడా హాజరయ్యారు.
ట్రంప్ మాట్లాడుతూ.. “తాను భారతదేశంలో గడిపిన ఈ రెండు రోజులు చాలా ప్రత్యేకమైనవని, నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, నేను భారతీయులను గౌరవిస్తాను. మేము తిరిగి వస్తాము.” అని పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటుచేసిన విందు అనంతరం ట్రంప్ దంపతులు యుఎస్ తిరుగు ప్రయాణమయ్యారు.