తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విప్పపూవు ఏరుకునేందుకు వెళ్లిన ఓ గిరిజన బాలికను అడవి పంది పొట్టనుబెట్టుకుంది. చర్ల మండలం మారుమూల పూసుగుప్పలో ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోడి గణపతి కుమార్తె కవిత(14), మరో ఇద్దరు తోటి బాలురతో కలిసి దగ్గర్లోని అటవీ ప్రాంతానికి విప్పపూవు సేకరణకు వెళ్లింది. ఈ సమయంలో వెనక నుంచి వచ్చిన ఓ అడవి పంది హఠాత్తుగా కవితపై దాడి చేసింది. పక్కన ఉన్న బాలురు రాళ్లు విసరడంతో… అది అక్కడనుంచి పారిపోయింది.
ఈ దాడిలో బాలిక ఛాతి, చేతులు, కాళ్లపై తీవ్రగాయాలవ్వడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది. దీంతో పక్కన ఉన్న బాలురు..ఓ యువకుడి సాయంతో బాలికను గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్లలోని గవర్నమెంట్ హస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే కవిత చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలికపై దాడిచేసే సమయంలో అడవి పందికి బాణం గుచ్చుకొని ఉన్నట్టు బాలికతో ఉన్న బాలురు చెబుతున్నారు. కాగా బాలిక కుటుంబానికి రూ.5లక్షల పరిహారం చెల్లించాలని అటవీ సంరక్షణ అధికారి శోభ జిల్లా అధికారులను ఆదేశించారు.