మూడు ముక్కలాటలో ఈ ముగ్గురి రూటే సెపరేటు

|

Jan 21, 2020 | 6:54 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. రాజధానిపై మాటల తూటాలు పేలుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అదే సమయంలో సీఆర్డీఏ రద్దు చేసింది. మరోవైపు శాసనమండలికి బిల్లును పంపింది ప్రభుత్వం. అక్కడ ఆ బిల్లు ఆమోదం పొందుతుందా..లేదా అనే సంగతి పక్కన పెడితే..ఏపీ అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవరా ముగ్గురు..ఏంటా కథ అనేది చూడాలంటే కొద్దిగా అమరావతి రాజధానిలో ఉన్న అసెంబ్లీ కథలోకి వెళ్లాల్సిందే.. […]

మూడు ముక్కలాటలో ఈ ముగ్గురి రూటే సెపరేటు
Follow us on

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. రాజధానిపై మాటల తూటాలు పేలుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అదే సమయంలో సీఆర్డీఏ రద్దు చేసింది. మరోవైపు శాసనమండలికి బిల్లును పంపింది ప్రభుత్వం. అక్కడ ఆ బిల్లు ఆమోదం పొందుతుందా..లేదా అనే సంగతి పక్కన పెడితే..ఏపీ అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవరా ముగ్గురు..ఏంటా కథ అనేది చూడాలంటే కొద్దిగా అమరావతి రాజధానిలో ఉన్న అసెంబ్లీ కథలోకి వెళ్లాల్సిందే..

అసెంబ్లీలో 151 ఎమ్మెల్యేలతో సంపూర్ణ మెజార్టీతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీకి 23 మంది ఉండగా..జనసేనకు ఒకే ఒక్కరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో పార్టీ ఎమ్మెల్యేల అవసరం లేకుండానే అధికార పక్షం బిల్లులను ఆమోదించింది. కానీ అనుకోకుండా ముగ్గురు సభ్యుల మద్దతు ఇప్పుడు వైసీపీకి లభించింది. వారే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి, రాజోలు ఎమ్మెల్యే రాపాకా వర ప్రసాద్. మొదటి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కాగా…మరొకరు జనసేన నేత.

పేరుకు టీడీపీలో ఉన్నా…వంశీ, మద్దాల గిరి జగన్ సర్కార్ చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారు. అద్భుతమని చెబుతున్నారు. తాను టీడీపీ వారితో కూర్చోలేనని…స్పీకర్ తమ్మినేని సీతారాంకు విన్నవించారు వల్లభనేని. ఫలితంగా ఆయన్ని ప్రత్యేకంగా కూర్చో పెట్టారు. ఇప్పుడు ఆయనకు తోడుగా మద్దాలగిరి వచ్చారు. జై జగన్ అనకపోయినా…అన్నంత పని చేశాడు. అమ్మ ఒడి మహాద్భుతమని కితాబునిచ్చారు. తాను ఏ గట్టునుంటానో చెప్పకనే చెప్పినట్లు అయింది. ఫలితంగా టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య రెండు అంకెలు తగ్గి.. 21కి చేరింది.

ఇక మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌కు చెప్పారు. పార్టీ కీలక సమావేశాలకు హాజరు కానీ రాపాక ఇప్పుడు తనదైన పంథాలోనే వెళుతున్నాడు. పార్టీ అధినేత నిర్ణయాన్ని కాదని..జగన్ సర్కార్ చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని చెప్పారు. మరోవైపు మూడు రాజధానులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పాడు. ఫలితంగా పవన్ కల్యాణ్ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పై చర్య తీసుకుంటారా..తీసుకోరా అనే చర్చ సాగుతోంది. ఉన్నది ఒక్కరే ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ను అనర్హుడిగా చేయమని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టే రాపాక తన దారి తనదే అన్నట్లుగా ఉన్నారని చెప్పవచ్చు. మొత్తంగా మూడు ముక్కలాటలో ఆ ముగ్గురి రూటే సపరేట్ అని చెప్పాలి.