దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం జరగడంతో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. జూన్ 26 నుంచి 30 మధ్య రూ.973.61 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జూలై 1 నుంచి లాక్డౌన్ విధిస్తే, ఎక్కడ షాపులు మూతపడతాయేమోనన్న కంగారుతో మందుబాబులు పెద్ద మొత్తంలతో మద్యం కొని నిల్వ చేసుకున్నారు.
కాగా.. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు బాసటగా నిలుస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ రాబడుల కంటే మద్యం విక్రయాలే ఎక్కువ ఊరట కలిగిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4997.81 కోట్ల రాబడి సమకూరింది. జూన్ నెలాఖర్లో అమ్మకాలు గణనీయంగా పెరగ్గా ఈ నెల 1 నుంచి 4 వరకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అమ్మకాలున్నాయి.