శ్రీ రాముడి గుడి కేవలం స్వదేశీనే నిర్మాణం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ స్పష్టంచేసింది. భారీ ప్రచార కార్యక్రమం ద్వారా వీటిని సాధారణ పౌరుల నుంచి మాత్రమే సేకరిస్తామని ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వెల్లడించారు. రామాలయ నిర్మాణం కోసం అవసరమైన విరాళాల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం చేపడుతామని ప్రకటించిన ట్రస్ట్, రామ భక్తుల నుంచి స్వచ్ఛందంగా విరాళాలను స్వీకరిస్తామని వెల్లడించింది. ఇందుకోసం రూ.పది, రూ.వంద, రూ.వెయ్యి విలువగల కూపన్లను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. కేవలం వీటి ద్వారా మాత్రమే విరాళాలను స్వీకరిస్తామని స్పష్టంచేసింది.
ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపుల్లో పారదర్శకత కోసమే ఈ కూపన్లను రూపొందించామని రామజన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. ఇందుకోసం రూ.10విలువగల 4కోట్ల కూపన్లు, రూ.100విలువైన 8కోట్ల కూపన్లు, రూ.1000విలువగల 12లక్షల కూపన్లను ప్రింట్ చేసినట్లు రామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. రామ మందిర నిర్మాణం కోసం ఎలాంటి విదేశీ విరాళాలను సేకరించమని ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ స్పష్టంచేశారు.
వీటిని అవసరమైన అనుమతులు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే సీఎస్ఆర్ కింద వచ్చే నిధులను మాత్రం ఆలయం చుట్టుపక్కల నిర్మించే భవనాలకు వినియోగిస్తామని తెలిపారు. నిధుల సేకరణపై ఎలాంటి పరిమితులు లేవని.. అదేవిధంగా రామాలయ నిర్మాణ ఖర్చుపై కూడా ఎలాంటి అంచనాలు వేయలేదని చంపత్ రాయ్ వెల్లడించారు. తాము చేపట్టబోయే భారీ ప్రచార కార్యక్రమం ద్వారా రామ జన్మభూమి ఉద్యమంపై ప్రజల్లో అవగాహన కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.