జగన్, కేసీఆర్‌లపై వాల్‌మార్ట్‌ ప్రశంసలు..ఎందుకంటే?

| Edited By: Srinu

Dec 03, 2019 | 7:07 PM

ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై ఓ ఎం.ఎన్.సి. ప్రశంసలు కురిపించింది. తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా గత దశాబ్ద కాలంగా వ్యాపారాన్ని విస్తరించిన బహుళ జాతి సంస్థ (ఎం.ఎన్.సి) వాల్ మార్ట్ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల కాలంలో రిటైల్ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్లను సాక్షాత్తు వాల్‌మార్ట్ ఇండియా సిఈవో, ప్రెసిడెంట్ క్రిష్ అయ్యర్ చేయడం విశేషం. పదేళ్ళ క్రితం వాల్‌మార్ట్‌కు చెందిన బెస్ట్ ప్రైస్ రిటైల్ అవుట్‌లెట్స్‌ని […]

జగన్, కేసీఆర్‌లపై వాల్‌మార్ట్‌ ప్రశంసలు..ఎందుకంటే?
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై ఓ ఎం.ఎన్.సి. ప్రశంసలు కురిపించింది. తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా గత దశాబ్ద కాలంగా వ్యాపారాన్ని విస్తరించిన బహుళ జాతి సంస్థ (ఎం.ఎన్.సి) వాల్ మార్ట్ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల కాలంలో రిటైల్ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోందని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్లను సాక్షాత్తు వాల్‌మార్ట్ ఇండియా సిఈవో, ప్రెసిడెంట్ క్రిష్ అయ్యర్ చేయడం విశేషం.

పదేళ్ళ క్రితం వాల్‌మార్ట్‌కు చెందిన బెస్ట్ ప్రైస్ రిటైల్ అవుట్‌లెట్స్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. తొలుత రాజేంద్రనగర్ సమీపంలో తమ భారీ స్టోర్‌ని ఏర్పాటు చేసిన వాల్‌మార్ట్ ఆ తర్వాత నగరంలో పలు చోట్ల తమ అవుట్‌లెట్‌లను ప్రారంభించింది. ఆ తర్వాత విజయవాడ, విశాఖపట్నంలలో కూడా వాల్‌మార్ట్ స్టోర్‌లు ఏర్పాటయ్యాయి. తాజాగా ఏపీలో తమ వ్యాపారాన్ని విస్తరిస్తోంది వాల్‌మార్ట్ సంస్థ.

అయితే తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు హెచ్.డి.ఎఫ్.సి.బ్యాంకుతో టై-అప్ అయిన వాల్‌మార్ట్… సంయుక్తంగా క్రెడిట్ కార్డును విడుదల చేసింది. క్రెడిట్ కార్డు లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వాల్‌మార్ట్ ఇండియా సీఈవో, ప్రెసిడెట్ క్రిష్ అయ్యర్… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కితాబునిచ్చారు.

తమ అవుట్‌లెట్లను ప్రారంభించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా సులువైన విధానాలతో అత్యంత వేగవంతంగా లైసెన్సులు అందించారని, ఈజ్ ఆఫ్ బిజినెస్‌లో రెండు రాష్ట్రాలు ముందున్నాయని చెప్పుకొచ్చారు క్రిష్ అయ్యర్. అందువల్లే పదేళ్ళ క్రితం తాము ఫస్ట్ స్టోర్ ప్రారంభించినా… గత పదమూడు నెలల్లో ఏకంగా 17 కొత్త స్టోర్లను ఏర్పాటు చేయగలిగామని, ప్రస్తుతం మొత్తం 27 స్టోర్లు పనిచేస్తున్నాయని అయన వివరించారు. త్వరలోనే కర్నూలు, తిరుపతి నగరాల్లోను వాల్‌మార్ట్-బెస్ట్ ప్రైస్ స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారయన.

దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్నప్పటికీ.. రిటైల్ రంగం మాత్రం దూసుకుపోతోందని క్రిష్ అయ్యార్ చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మరో 50 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు వాల్‌మార్ట్ సిద్దమవుతుందని ఆయన చెప్పారు.