GHMC Election Results 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కంచికి చేరిన టీడీపీ కథ, కంచుకోటగా నిలిచిన ప్రాంతాల్లో సైతం గల్లంతు

|

Dec 05, 2020 | 6:05 AM

బల్దియాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ 2020 ఎన్నికల్లో కనీసం ఎక్కడా సరైన పోటీ ఇవ్వలేకపోయింది. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌,..

GHMC Election Results 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కంచికి చేరిన టీడీపీ కథ, కంచుకోటగా నిలిచిన ప్రాంతాల్లో సైతం గల్లంతు
Follow us on

బల్దియాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ 2020 ఎన్నికల్లో కనీసం ఎక్కడా సరైన పోటీ ఇవ్వలేకపోయింది. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ముందే కీలక పోటీ కన్పించింది. మిగతా పార్టీలను ఎవ్వరూ లెక్కలోకి తీసుకోలేదు. అయినా కాంగ్రెస్‌ ఒకటి రెండు స్థానాల్లో తన ఉనికి చాటుకుంది. కానీ తెలుగుదేశం జాడ మాత్రం ఎక్కడా కన్పించ లేదు. గ్రేటర్‌లో తమ ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గ్రేటర్‌ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 106 డివిజన్లలో టీడీపీ తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది. వివిధ సామాజికవర్గాల మధ్య బ్యాలెన్స్‌ పాటిస్తూ అభ్యర్థులను ప్రకటించింది. వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రచారంలో హంగూ, ఆర్భాటాలూ పెద్దగా లేకపోయినా గట్టిగానే కష్టపడ్డారు.

హైదరాబాద్‌ అభవృద్ధిలో టీడీపీ పాత్ర ఎంతో ఉందని గొంత చించుకున్నా… ఎందుకో ఓటర్ల చెవికెక్కలేదు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ప్రాంతాల్లో… ఇప్పుడు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా సెటిలర్లపై టీడీపీ గంపెడాశలు పెట్టుకుంది. కానీ సెటిలర్లు ఎవ్వరూ సైకిల్‌ వైపు చూడనే లేదు. విస్తృతంగా ప్రచారం నిర్వహించినా… ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయలేకపోయారు. కనీసం ఆకట్టుకునే నేతలను కూడా ప్రచారంలో దింపలేకపోయారు. మొదటి నుంచి గ్రేటర్‌ వార్‌ ప్రధానంగా మూడు పార్టీల మధ్యే ఉంటుందని అంతా భావించారు. ఇప్పుడు అదే జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన పార్టీ కథ ఈ దెబ్బతో కంచికి చేరింది.