కరోనా కల్లోలం నేపథ్యంలో తెలంగాణలో నేటి నుంచి ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు టీవీలో పాఠాలు ప్రారంభమయ్యాయి. దూరదర్శన్, టీ శాట్ ద్వారా పాఠాలను ప్రసారం చేస్తున్నారు. వారంలో ఐదు రోజులు పాఠాలు బోధించి, రెండు రోజులు సెలవులు ఇస్తున్నారు.
టీవీలో పాఠాలు పూర్తయిన తర్వాత టీవీలోనే వర్క్షీట్ని చూపిస్తారు. విద్యార్థులు వర్క్షీట్ పూర్తి చేసి, టీచర్లకు వాట్సాప్ ద్వారా పంపించేల్సి ఉంటుంది. టీవీలు లేని విద్యార్థులకు పాఠశాలలు, పంచాయితీ కార్యాలయాలు, తోటి వారి ఇళ్లల్లో టీవీలు చూసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే పాఠాలు బోధిస్తున్నారు. ఇంగ్లీష్, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఇంకా ఆన్లైన్ పాఠాలు షురూ కాలేదు. త్వరలోనే వారికి కూడా పాఠాలు బోధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా నేటి నుంచి దూరదర్శన్ ద్వారా పాఠాలు మొదలయ్యాయి. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఇంటర్మీడియట్ పాఠాలు ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేసింది ఇంటర్మీడియట్ బోర్డ్. ఇంటర్ వెబ్సైట్, యూట్యూబ్లో కూడా పాఠాలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కూడా నేటి నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్కూళ్లలో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు సిద్ధమయ్యారు టీచర్లు. పాఠశాలల్లో శానిటైజ్ చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఆన్లైన్ తరగతుల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రతి తరగతికి ఓ వ్యాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ప్రతి విద్యార్థికి అర్థమయ్యే విధంగా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. టీచర్లు ఎప్పటికప్పుడు దీనిపై మానిటరింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఐటిడిఏ పరిధిలో 20 శాతం విద్యార్థులకు మాత్రమే టీవీలు అందుబాటులో ఉండటంతో మిగతా విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రత్యేక అనుమతులతో వారానికి మూడు రోజులు గ్రామాలకే వెళ్లి విద్యాబోధన చేసేందుకు టీచర్లను సంసిద్ధం చేస్తున్నారు.