ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు అన్నారు. శాసనసభలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి 429 సంవత్సరాల కిందటే బీజం పడింది. 1869లో హైదరాబాద్ మున్సిపాలిటీగా, 1933లో చాదర్ఘాట్ అనే మరో మున్సిపాలిటీ, 1937 జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ, 1945లో సికింద్రాబాద్ అనే మున్సిపాలిటీ ఏర్పడిందని మంత్రి గుర్తు చేశారు. 1948-56 మధ్య కాలంలో హైదరాబాద్ స్టేట్గా ఉన్న సమయంలోనే 1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిందన్నారు. ఇందు కోసం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని కూడా రూపొందించారన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. మారుతున్న కాలానుగుణంగా కొత్త చట్టం తీసుకురావాలన్న అవసరాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించిందన్న కేటీఆర్.. ముఖ్యమైన ఐదు సవరణలు చేసుకుంటున్నామని తెలిపారు.
2015లో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక జీవో ద్వారా మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయించామన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో మహిళా రిజర్వేషన్లకు ఇవాళ చట్టం చేసుకుంటున్నామని తెలిపారు. 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను కేసీఆర్ సర్కార్ గుర్తించిందన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు మంత్రి కేటీఆర్.