దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. చాలా మంది కార్మికులు, ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయారు. ఈ క్రమంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే ఓ సంస్థ సహకారంతో డీట్ (డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ) అనే వెబ్సైట్ ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేస్తున్న ఆ శాఖ.. త్వరలో కార్పొరేట్ కంపెనీ యాజమాన్యాలతో సమన్వయం కానుంది.
సదరు కంపెనీల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి భర్తీ చేయనుంది. ఇందులో జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లు కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రతి జిల్లాలో జాబ్మేళా..: ఇదివరకు ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్లో ఉద్యోగ మేళాలు నిర్వహించినప్పటికీ ఒకట్రెండు కంపెనీలు మాత్రమే పాల్గొనేవి. ఇప్పుడలా కాకుండా కంపెనీల వారీగా ఉన్న ఉద్యోగాలను కేటగిరీలుగా విభజించి ఆమేరకు ఒక్కో కేటగిరీని భర్తీ చేస్తారు. అభ్యర్థుల ఆసక్తిని బట్టి కంపెనీలను ఎంపిక చేసుకోవచ్చు. కంపెనీల వారీగా ఖాళీల వివరాలను సేకరించిన తర్వాత వాటిని ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఆన్లైన్ పద్దతిలోనే జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్ ద్వారా జాబ్ మేళా నిర్వహించి భర్తీ చేస్తారు.